బీజేపీని 'శ్రీరాముడు' దెబ్బతీస్తాడా?: మధ్యప్రదేశ్లో బీజేపీకి కాంగ్రెస్ ఊహించని షాక్
భోపాల్: భారతీయ జనతా పార్టీకి హిందుత్వ ముద్ర ఉన్న విషయం తెలిసిందే. ఓటు బ్యాంకు రాజకీయాల నేపథ్యంలో కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఏవీ హిందువులను పట్టించుకోవడం లేదని, బీజేపీ మాత్రమే హిందుత్వ పార్టీ అనే ఆరోపణలు, ముద్ర ఉంది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆలయాల వెంట ప్రదక్షిణలు చేస్తున్నారు.
గతంలో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంది. దీనికి రాహుల్ గాంధీ 'టెంపుల్ రన్' కారణం అనే ప్రచారం జరిగింది. ఏది ఏమైనా మెజార్టీ హిందువులలో తమ పట్ల ఉన్న వ్యతిరేకతను తొలగించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మధ్యప్రదేశ్లోనూ కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ దారిలోనే నడుస్తోంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే జైశ్రీరామ్ నినాదం
2017 నవంబర్లో మధ్యప్రదేశ్లో చిత్రకూట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడి విజయం తర్వాత కాంగ్రెస్ హిందుత్వ ముద్ర కోసం మరింతగా తాపత్రయపడుతున్నట్లుగా తెలుస్తోందని అంటున్నారు. ఏడాది క్రితం జరిగిన చిత్రకూట్ ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఆ తర్వాత అసెంబ్లీలో జై శ్రీరామ్ నినాదాలు చేశారు.
రామ్ వ్యాన్ గమన్ పాథ్
ఈ ఏడాది జూలై నెలలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు కమల్ నాథ్ ఓ ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 'రామ్ వ్యాన్ గమన్ పాథ్' నిర్మిస్తామని చెప్పారు. నాడు శ్రీరాముడు తన 14 ఏళ్ల వనవాసంలో భాగంగా 11 ఏళ్లపాటు చిత్రకూట్లో ఉన్నారు. ఆయన నడయాడిన ప్రాంతాలను కలిపి రామ్ వ్యాన్ గమన్ పాథ్గా నిర్మిస్తామని తెలిపారు.
రామ్ వ్యాన్ గమన్ పాథ్లో ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు అంటే?
రామ్ వ్యాన్ గమన్ పాథ్ ప్రకటన మధ్యప్రదేశ్లో బాగా ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా 7 జిల్లాలలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ ప్రభావం చూపుతుందని, అది తమకు లాభిస్తుందని ఆసిస్తున్నారు. చిత్రకూట్, సెమారియా, రాంపూర్ - బాఘేలన్, సాంతా, మైహార్, అమర్పటన్, రేవా, గుర్, చుర్హాత్, బియోహరి, సోహగ్పూర్, సిహోరా, షాహ్దోల్, ఉమారియా, బర్వారా, దిండోరి, నాగోడ్, రైగోన్, బహోరీబంద్, కట్నిలతో పాటు జబల్పూర్ నగరంలోని రెండు నియోజకవర్గాలలో రామ్ వ్యాన్ గమన్ పాథ్ ఉండనుంది. ఇక్కడి నియోజకవర్గాలలో ప్రస్తుతం కాంగ్రెస్కు 10, బీజేపీకి 12, బీఎస్పీకి 1 ఎమ్మెల్యే ఉన్నారు.
రామ్ వ్యాన్ గమన్ పాథ్ అప్పటి ప్రకటన
రామ్ వ్యాన్ గమన్ పాథ్ ప్రకటనను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 2007లో చేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటికీ దీని అమలులో జాప్యం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ఇదే అంశాన్ని లేవనెత్తుతోంది. ఇది బీజేపీకి మైనస్ అవుతుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ కూడా హిందూ వ్యతిరేక ముద్ర పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.
మరిన్ని హామీలు
కేవలం రామ్ వ్యాన్ గమన్ పాథ్ మాత్రమే కాదని, వీటితో పాటు ప్రతి గ్రామ పంచాయతీలో గోశాలలు, సంస్కృతాన్ని పెంపొందించేందుకు పాఠశాలలను కూడా కాంగ్రెస్ హామీ ఇస్తోందని రామ్ వ్యాన్ గమన్ పాథ్ సమితి చైర్మన్, స్టేట్ కాంగ్రెస్ కన్స్యూమర్ ప్రొటక్షన్ సెల్ చీఫ్ హరిశంకర్ శుక్లా అన్నారు.
బీజేపీ నేతలు ఏం చెప్పారంటే?
ఇప్పటి వరకు హిందూ సానుభూతిపరులు బీజేపీ వైపు ఉంటూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ముద్ర తొలగించుకునేందుకు అనేక హామీలు ఇస్తుండటం కమలం పార్టీకి గట్టి షాక్ అని చెబుతున్నారు. రామ్ వ్యాన్ గమన్ పాథ్ తమకు రాజకీయ అంశం కాదని, అది హిందువుల విశ్వాసానికి సంబంధించిన అంశమని, దీనిని తాము మతపరమైన, ఆధ్యాత్మిక టూరిజంగా చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి బీజేపీ ప్రభుత్వం చరిత్రపై రీసెర్చ్ చేస్తోందని తెలిపారు. ఇది ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశం కాబట్టి పకడ్బంధీగా చేయాలని చెప్పారు.