సీఎంకు సినిమా చూపించిన బీజేపీ, జేడీఎస్: దెబ్బకు కాంగ్రెస్ పార్టీ, మైసూరు మేయర్ !
బెంగళూరు/మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిద్దరామయ్య సొంత జిల్లా కేంద్రం అయిన మైసూరు మహా నగర పాలికే మేయర్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షాలు వేసిన ప్లాన్ కు కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. బీజేపీ. జేడీఎస్ కలిసి సిద్దరామయ్యకు కోలుకోలేని దెబ్బ కొట్టారు.
మొత్తం 75 ఓట్లు
మైసూరు మహానగర పాలికేలో 65 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో బీజేపీకి 15, కాంగ్రెస్ 20, జేడీఎస్ 20, ఎస్ డీపీఐకి 2, స్వతంత్ర కార్పొరేటర్లు 8 మంది ఉన్నారు. ఇక ఎంపీలు, శాసన సభ్యులు కలిపితే కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో మొత్తం 75 ఓట్లు ఉన్నాయి.
నాలుగేళ్లు సినిమా
కర్ణాటక ముఖ్మమంత్రి సిద్దరామయ్య సొంత జిల్లా కేంద్రం మైసూరు నగరంలో బీజేపీ, జేడీఎస్ మిత్రపక్షంగా ఉంటూ గత నాలుగేళ్ల నుంచి మేయర్ పదవి అధికారం పంచుకుంటు వస్తూ కాంగ్రెస్ పార్టీకి సినిమా చూపించారు. అయితే ఈ సారి మాత్రం వారికి మొదట నిరాశ ఎదురైయ్యింది.
ఒక్కరూలేరు
నాలుగేళ్లు అధికారం పంచుకుంటూ వస్తున్న బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఈ సారి కొంత ఆందోళన చెందాయి. రిజర్వేషన్ల ప్రకారం ఈ సంవత్సరం మేయర్ పదవి ఎస్సీ మహిళ, ఉప మేయర్ పదవి ఎస్టీ మహిళకు ఇవ్వాల్సి ఉంది. అయితే బీజేపీ, జేడీఎస్ లో ఎస్సీ మహిళా కార్పొరేటర్ ఒక్కరూ లేరు.
కాంగ్రాస్ ధీమా
మైసూరు నగర మేయర్ కావడానికి కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. బీజేపీ, జేడీఎస్ లో ఒక్క ఎస్సీ మహిళా కార్పొరేటర్ కూడా లేకపోవడంతో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మేయర్ పదవి దక్కుతుందని ఆ పార్టీ నాయకులు ధీమాతో ఉన్నారు.
ప్రతిపక్షాలు ప్లాన్
కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా భాగ్యవతి, కమలా ఉదయ్ పోటీపడ్డారు. భాగ్యవతి తనకే మేయర్ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, సీఎం సిద్దరామయ్య కమలా ఉదయ్ ని మేయర్ చెయ్యాలని నిర్ణయించారు. అయితే బీజేపీ, జేడీఎస్ నాయకులు కాంగ్రెస్ రెబల్ కార్పొరేటర్ భాగ్యవతిని రంగంలోకి దించారు.
వెనుక డోర్ నుంచి నామినేషన్
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కమలా ఉదయ్ నామినేషన్ వేశారు. అయితే బీజేపీ, జేడీఎస్ కార్పొరేటర్లతో ప్రత్యక్షం అయిన కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి భాగ్యవతి వెనుక డోర్ నుంచి వచ్చి నామినేషన్ వేశారు. ఎన్నికల అధికారి శివయోగి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడంతో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు.
భారీ మెజారీటితో మేయర్
కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి భాగ్యవతికి మద్దతుగా బీజేపీ, జేడీఎస్ కార్పొరేటర్లు ఓటు వెయ్యడంతో ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద 43 ఓట్ల మెజారిటీతో మేయర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇంటికి పంపించిన బీజేపీ, జేడీఎస్ అధికారం కైవసం చేసుకుంది. భాగ్యవతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది.
సీఎం అసహనం
ఒక్క ఎస్సీ మహిళా కార్పొరేటర్ లేకున్నా బీజేపీ, జేడీఎస్ పార్టీలు పక్కా ప్లాన్ తో కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరం చెయ్యడంతో సీఎం సిద్దరామయ్య అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. మైసూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద సీఎం సిద్దరామయ్య మండిపడ్డారని సమాచారం.