ఎన్సీపీ ప్రతిపాదనకు నో: మహాకూటమిలో రాజ్థాక్రే పార్టీని చేర్చుకునేది లేదన్న కాంగ్రెస్
మహారాష్ట్ర నవనిర్మాణ సేనను మహాకూటమిలో కలుపుకోవాలంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కాంగ్రెస్ను కోరారు. అయితే పవార్ కోరికను సున్నితంగా తిరస్కరించింది కాంగ్రెస్. మహారాష్ట్రలో 2019లో జరిగే లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో లాభపడాలంటే ఎమ్ఎన్ఎస్ పార్టీని మహాకూటమిలో చేర్చుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం పవార్ వ్యక్తపరిచారు. అయితే దీనిపై ఇంకా చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని ఎన్సీపీ ప్రతినిధి ఒకరు తెలిపారు. మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు మహాకూటమిలో భాగస్వామి అయితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు ఎన్సీపీ ప్రతినిధి నవాబ్ మాలిక్. బలంగా ఉన్న బీజేపీని ఢీకొనాలంటే అన్ని శక్తులూ ఒకటవ్వాలని ఈ క్రమంలోనే ప్రతి ఓటు ప్రతి పార్టీ ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్పారు.
రాఫెల్ ఒప్పందం పై ప్రధాని మోడీకి మద్దతుగా నిలిచిన శరద్ పవార్
కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రాజ్థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి కాబట్టి ఆపార్టీని మహాకూటమిలోకి ఆహ్వానించే ప్రసక్తే లేదని ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ పేర్కొన్నారు. ఎమ్ఎన్ఎస్ రాజ్యాంగాన్ని విశ్వసించదు అని చెప్పిన నిరుపమ్... కేవలం కుల మత రాజకీయాలను మాత్రమే చేస్తుందని చెప్పారు. ఒకవేళ ఎమ్ఎన్ఎస్తో పొత్తు పెట్టుకుంటే మిగతారాష్ట్రాల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని గతవారం జరిగిన సమావేశంలో కాంగ్రెస్ కుండబద్దలు కొట్టింది. అంతేకాదు 2014 లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్ఎన్ఎస్ పార్టీ ప్రదర్శన చాలా ఘోరంగా ఉన్నిందని గుర్తుచేసింది. ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే గెలిచిందని గుర్తుచేసింది.
మరోవైపు చిన్నపార్టీలకు కూటమిలో ప్రాధాన్యత కల్పించాలని కోరారు స్వాభిమాని షెట్కారీ సంఘటన్ అధ్యక్షుడు రాజు షెట్టి. అక్టోబర్ 6న ఆయన భరిపా బహుజన్ మహాసంఘ్ పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ అంబేడ్కర్ను కలవనున్నారు. మహారాషట్రలో కులమత ఘర్షణలు ఎక్కువ అవుతున్నాయని అది రాష్ట్రానికి మంచిది కాదని అన్నారు రాజు షెట్టి. మహారాష్ట్రలో ప్రజలు ఎప్పుడూ మహాత్మా పూలే, షాహూ మహరాజ్, అంబేడ్కర్ సిద్ధాంతాలనే విశ్వసిస్తూ పాటించారని గుర్తుచేసిన రాజు షెట్టి... లౌకికవాద పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు మజ్లిస్తో కూడా కలిసి వెళ్లే యోచనలో ఉన్నట్లు ప్రకాష్ అంబేడ్కర్ స్పష్టం చేశారు.