మీకు మీరే..మాకు మేమే! ఆమ్ ఆద్మీతో కుదురని పొత్తు..కాంగ్రెస్ ఒంటరిపోరు
న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేయాలని ఉవ్విళ్లూరిన కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురైంది. సీట్ల సర్దుబాటు వ్యవహారంలో ఆప్ అగ్ర నాయకత్వం మెట్టు దిగలేదు. మెత్త బడలేదు. దీనితో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగింది. ఢిల్లీ పరిధిలోని ఏడు లోక్ సభ స్థానాలు ఉండగా.. ఆరింటికి అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. దీనితో ఢిల్లీలో త్రిముఖ పోరు ఖాయమైంది. భారతీయ జనతాపార్టీ-ఆమ్ ఆద్మీ పార్టీ-కాంగ్రెస్ లు తలపడబోతున్నాయి.
కొలంబో పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్ కార్యకర్తలు దుర్మరణం: మరో ఆరుమంది మిస్సింగ్
కాంగ్రెస్, ఆప్ ఉమ్మడి శతృవు.. కమలం
ఢిల్లీ పరిధిలో మొత్తం ఏడు లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2014 నాటి ఎన్నికల్లో ఏడింటినీ బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. పోటీ చేసిన అన్ని చోట్లా ఘోరంగా ఓటమి పాలైంది కాంగ్రెస్ పార్టీ. ఆ చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీని ఢీ కొట్టే సత్తా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేసి, ఉమ్మడి శతృవును తుద ముట్టించాలనేది కాంగ్రెస్ వ్యూహం. బీజేపీని దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ కలిసి వస్తే.. సహకరిస్తామంటూ ఇదివరకే కేజ్రీవాల్ కూడా ప్రకటించారు. దీనితో వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదురుతుందని భావించారంతా.
ఒక్క సీటు వద్ద తేడా..
సీట్ల సర్దుబాటు సందర్భంగా ఢిల్లీ పరిధిలో ఉన్న ఏడు లోక్ సభ స్థానాల్లో అయిదింట్లో తాము పోటీ చేస్తామని, మిగిలిన రెండింటినీ ఇస్తామని కేజ్రీవాల్ ప్రతిపాదించారు. ఆదిలోనే హంసపాదు ఎదురైనట్టు.. ఎలాంటి బేరసారాల్లేకుండా తమకు రెండు సీట్లకు మాత్రమే పరిమితం చేయడాన్ని కాంగ్రెస్ అంగీకరించలేదు. మూడు స్థానాలు కావాలంటూ పట్టుబట్టింది. ఈ విషయంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కురువృద్ధురాలు షీలా దీక్షిత్ పలుమార్లు అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. మూడు స్థానాలు కేటాయించాలంటూ పట్టుబట్టారు. దీనికి కేజ్రీవాల్ ఒప్పుకోలేదు. రెండంటే రెండే ఇస్తామని భీష్మించారు. ఈ విషయంపై రెండు పార్టీల మధ్య కాస్త వాడి, వేడిగా వాదోపవాదాలు కూడా చోటు చేసుకున్నాయి. రాహుల్ గాంధీ సైతం.. జోక్యం చేసుకున్నారు. అయినప్పటికీ.. కేజ్రీవాల్ మెట్టు దిగలేదు. ఇక లాభం లేదనకుని, తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరిపోరుకు దిగింది కాంగ్రెస్ పార్టీ.
లోక్ సభ బరిలో షీలా, అజయ్ మాకెన్
పొత్తు చర్చలు బెడిసి కొట్టిన నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ ఆరు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు షీలా దీక్షిత్ సోమవారం ఉదయం ఓ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం.. ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి షీలా పోటీ చేయబోతున్నారు. చాందినీ చౌక్ నుంచి జేపీ అగర్వాల్, తూర్పు ఢిల్లీ నుంచి అర్విందర్ లవ్లీ బరిలో నిల్చున్నారు. న్యూఢిల్లీ సీటును అజయ్ మాకెన్ కు కేటాయించారు. వాయవ్య ఢిల్లీ స్థానం నుంచి రాజేష్ లిలోతియా, పశ్చిమ ఢిల్లీ స్థానం నుంచి మహాబల్ మిశ్రా పోటీ చేయనున్నారు. మరో స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
మే 12న పోలింగ్..
దేశవ్యాప్తంగా ఆరో దశ పోలింగ్ సందర్భంగా దేశ రాజధాని పరిధిలోని ఏడు లోక్ సభ స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఒకే దఫాలో పోలింగ్ ముగిసిపోతుంది. కాంగ్రెస్ తో పొత్తు కుదిరేది కాదని అనుకున్నారో.. ఏమో గానీ, ఇప్పటికే అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరోవంక- నాలుగు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ.. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ను కూడా బరిలో దింపే అవకాశాలు లేకపోలేదు.