సోనియా మార్క్ పాలిటిక్స్: జనంలోకి కాంగ్రెస్..దేశవ్యాప్తంగా పాదయాత్రలు!
న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభంజనానికి కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాలను మినహాయిస్తే.. దేశవ్యాప్తంగా జరిగిన ఏ ఒక్క ఎన్నికలోనూ వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎదురొడ్డి నిలవలేకపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ-కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జోడీకి ధీటుగా వ్యూహాలను రచించలేక చతికిలపడింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ కలవరిస్తోన్న కమలనాథుల కలను సాకారం అయ్యే దుస్థితికి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ-షా జోడీని ధీటుగా ఎదుర్కొనడానికి జనం బాట పట్టాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేయాలని సంకల్పించింది.
జాతిపిత మహాత్మాాగాంధీ 150వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి సన్నాహాలు చేపట్టింది. దీనికి గల విధి విధానాలపై చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం హస్తినలో భేటీ కానున్నారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అనంతరం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో కాంగ్రెస్ భేటీ నిర్వహించే అవకాశం ఉంది. అక్టోబర్ 2వ తేదీ నాడు మహత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలు దేశవ్యాప్తంగా ఆరంభం కానున్నాయి. వారంరోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగబోతున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో.. పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయించుకుంది.
అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి వరకు నాయకులు ఈ పాదయాత్రలో భాగస్వామ్యులు కావాల్సి ఉంటుందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కాంగ్రెస్ సంప్రదాయాన్ని సూచించేలా గాంధీ టోపీలు ధరించాలని, జాతీయ జెండాను భుజాన మోస్తూ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని సూచనప్రాయంగా నిర్దేశించినట్లు వేణుగోపాల్ తెలిపారు. దీనికి గల మార్గదర్శకాలు, దిశా నిర్దేశాలపై మరింత చర్చించాల్సి ఉందని ఆయన తెలిపారు. సోనియాగాంధీ సారథ్యంలో ఈ పాదయాత్రలు కొనసాగుతాయని అన్నారు. పాదయాత్రల సందర్భంగా మహాత్మాగాంధీ సిద్ధాంతాలను మాత్రమే ప్రచారం చేయాాలా? లేక పార్టీ బలోపేతంపైనా జనంలోకి వెళ్లాలా? వద్దా? అనే అంశాన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉందని చెప్పారు.