చేతులు కాలాక: పింక్ సీన్ రివర్స్: జైపూర్కు కాంగ్రెస్ పెద్దలు: మైనారిటీలో: 109 మంది బలం?
జైపూర్: రాజస్థాన్లో పతనం అంచున నిల్చున్న అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చివరి నిమిషంలో గట్టెక్కించడానికి ప్రయత్నాలు ఆరంభం అయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు రాజస్థాన్కు ప్రయాణం అవుతున్నారు. కాస్సేపట్లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశం ఆరంభం కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు రాజస్థాన్కు బయలుదేరి వెళ్లనున్నారు. సీఎల్పీ సమావేశం ముగిసిన వెంటనే వారంతా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్తో సమావేశం కానున్నారు. సీఎల్పీలో వ్యక్తమైన అభిప్రాయాల ఆధారంగా తమ కార్యాచారణ ప్రణాళికను రూపొందించుకోనున్నారు.
పతనం అంచున కాంగ్రెస్ సర్కార్: 30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో సచిన్ పైలట్: జేపీ నడ్డాతో
రాజస్థాన్కు కాంగ్రెస్ పెద్దలు
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి అవినాష్ పాండే ఇప్పటికే జైపూర్కు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, రణ్దీప్ సుర్జేవాలా ఈ మధ్యాహ్నానికి జైపూర్కు బయలుదేరి రానున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సహా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సహా 30 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు లేవనెత్తడంతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నుంచి పార్టీని గట్టెక్కించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
చేతులు కాలాక
నిజానికి- చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా తయారైంది కాంగ్రెస్ పరిస్థితి. రాజస్థాన్ కాంగ్రెస్లో అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయనే విషయం తెలిసినప్పటికీ.. పెద్దగా పట్టించుకోలేదు. ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తిరుగుబాటు బావుటాను ఎగురవేసే అవకాశం ఉందంటూ సమాచారం ఉన్నప్పటికీ.. దాన్ని నివారించడానికి పెద్దగా చర్యలను చేపట్టలేదు. చివరికి- సచిన్ పైలట్ దేశ రాజధానికి చేరుకున్న తరువాత కూడా.. ఆయనకు సోనియాగాంధీ అపాయింట్మెంట్ లభించలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఇక్కడిదాకా వచ్చిన తరువాతే మేల్కొంది.
109 మంది సభ్యుల బలం ఉందంటూ..
అశోక్ గెహ్లాట్ సారథ్యానికి 109 మంది శాసన సభ్యులు మద్దతు ఉందనే వార్తలు వస్తున్నాయి. అశోక్ గెహ్లాట్ సారథ్యాన్ని అంగీకరిస్తూ రూపొందించిన తీర్మానంపై 109 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని పీసీసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. వారంతా ప్రభుత్వానికి అండగా నిలిస్తే.. ఎలాంటి ఢోకా లేదని అంటున్నారు. సచిన్ పైలట్ చెబుతున్నట్టుగా ఆయన వెంట 30 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు లేరని చెబుతున్నారు. 19 మంది కంటే తక్కువే ఆయన వెంట ఉన్నారని, వారి తమకు మద్దతు ఇవ్వకపోయినప్పటికీ.. స్వతంత్ర సభ్యుల బలాన్ని కూడగట్టుకుంటామనే ధీమాను రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
సీఎల్పీ భేటీతో భవిష్యత్తు..
ఈ భేటీకి ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరవుతారనే అంశం మీదే అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంది. ప్రతి సభ్యుడూ సీఎల్పీ భేటీకి హాజరు కావాల్సి ఉంటుందటూ విప్ జారీ చేసింది కాంగ్రెస్. అయినప్పటికీ.. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరవుతారనేది అనుమానమే. ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మనుగడ, దాని భవిష్యత్తు ఎలా ఉంటుందనేది సీఎల్పీ భేటీతో తేటతెల్లం కాబోతోంది. 30 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు లేవనెత్తిన పార్టీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ప్రస్తుతం హస్తినలో మకాం వేశారు. పార్టీ అధిష్ఠానాన్ని కలుసుకోవాలని ఆయన భావించినప్పటికీ.. ఆ అవకాశం రాలేదు.