గుజరాత్ కాంగ్రెస్కు షాక్ : ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా, ఏ పార్టీలో చేరతారంటే..!!
అహ్మదాబాద్ : గుజరాత్ కాంగ్రెస్లో రాజ్యసభ పోలింగ్ అగ్గిరాజేసింది. తిరుగుబాటు నేతలు అల్పేశ్ ఠాకూర్, జాలా కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చారు. ఓటేశాక తాము పార్టీ నుంచి వీడుతున్నామని సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఇద్దరు నేతలు .. ఉమ్మడిగా కలిసి పార్టీని వీడుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
క్యాంపు రాజకీయాలు
గుజరాత్లో రెండు రాజ్యసభ స్థానాల కోసం ఇవాళ ఎన్నిక జరిగింది. అధికార బీజేపీ సరైన బలం లేకున్నా ఇద్దరు అభ్యర్థులను రంగంలోకి దింపింది. దీంతో తమ పార్టీ అభ్యర్థులను క్యాంపునకు తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీ. బుధవారం రాత్రి రాజస్థాన్లోని మౌంట్ అబుకు తీసుకెళ్లింది. కాంగ్రెస్ పార్టీకి 71 మంది ఎమ్మెల్యేలు ఉండగా 65 మంది మాత్రమే వెళ్లారు. నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం అనుమతి తీసుకొని .. గుజరాత్లోనే ఉండిపోయారు. కానీ అల్పేశ్ ఠాకూర్, దావల్ సింగ్ జాలా మాత్రం ధిక్కార స్వరం వినిపించారు. అల్పేశ్ను సంప్రదించని కాంగ్రెస్ పార్టీ .. జలాను మాత్రం తమతో రావాలని కోరింది. అయితే తాను క్యాంపునకు రాబోనని స్పష్టంచేశారు.
అప్పుడేం చెప్పారు ..?
లోక్ సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి ఠాకూర్ రాజీనామా చేశారు. రాజీనామా చేశాక మాట్లాడుతూ .. తాము రాహుల్ గాంధీ మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరామని పేర్కొన్నారు. కానీ వారు మమ్మల్ని విశ్వసించలేదని గుర్తుచేశారు. వారి వైఖరిని నిరసిస్తూ తాము రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశానని ప్రకటించారు. కానీ రాజ్యసభ ఎన్నికల్లో మాత్రం ఓటువేశారు. ఓటు వేసి తన మనసులోని మాటను బయటపెట్టారు. జాతీయ నాయకత్వాన్ని దృష్టిలో ఉంచుకొని .. ప్రజాధారణ పొందిన పార్టీకి మద్దతు తెలిపానని ... పరోక్షంగా బీజేపీ పేరును ప్రస్తావించారు.
సేమ్ టు సేమ్
జాలా కూడా అదేవిధంగా స్పందించారు. తమను కాంగ్రెస్ పార్టీ నేతలు చులకనతో చూశారని పేర్కొన్నారు. తమ మాటలను నేతలే కాదు కార్యకర్తలు కూడా వినని పరిస్థితి అని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎదురైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. వీరిద్దరూ నేతుల గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ను కలువడంతో వారు బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఆ ఊహాగానాలకు బలం చేకూరేలా ఓటేసి .. పదవులకు రాజీనామా చేయడంతో కాషాయ కండువా కప్పుకోనున్నారని స్పష్టమైంది. గుజరాత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అమిత్ షా, స్మృతి ఇరానీ లోక్ సభ ఎన్నికల్లో గెలువడంతో ఖాళీ ఏర్పడింది.