కాంగ్రెస్కు OROP అంటే వన్ రాహుల్ వన్ ప్రియాంకా: అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు
హిమాచల్ ప్రదేశ్ : ఓఆర్ఓపీ అంటే కొత్త భాష్యం చెప్పారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. ఓఆర్ ఓపీ అంటే వన్ రాహుల్ గాంధీ వన్ ప్రియాంకా గాంధీ అనే భాష్యం చెప్పారు అమిత్ షా. హిమాచల్ ప్రదేశ్ ఉనా ప్రాంతంలో బీజేపీ ఏర్పాటు చేసిన బూతులెవెల్ సమావేశానికి హాజరయ్యారు అమిత్ షా. ఆ సందర్భంగా కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమిత్ షా దేశవ్యాప్తంగా పర్యటించి కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ విధానాలను ఎండగడుతూ ఆ పార్టీపై ఫైర్ అవుతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ఉనావ్లో పర్యటించిన అతను... వన్ ర్యాంక్ వన్ పెన్షన్పై మాట్లాడారు. గత 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి సేవ చేసిన సైనికుడి గురించి ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానంను అమలు చేసిందని వెల్లడించారు. అయితే కాంగ్రెస్ కూడా OROP విధానం ఫాలో అవుతుందని అయితే అది "వన్ రాహుల్ వన్ ప్రియాంకా గాంధీ" అని ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ అగ్ర నాయకులు పర్యటించడం ఇది మూడోసారి కావడం విశేషం. అంతకుముందు నవంబర్లో మండిలో జరిగిన పన్నా ప్రముఖ్ సమ్మేళన్కు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. అంతకుముందు జేపీ నడ్డా హాజరై కార్యకర్తల్లో జోష్ నింపారు. బీజేపీ ప్రవేశ పెట్టిన పన్నా ప్రముఖ్ కింద పార్టీ ఓ వ్యక్తిని ఛీఫ్గా అప్పాయింట్ చేస్తుంది. ఆయనకు కొన్ని ఓటర్ల జాబితాలు ఇచ్చి ఆ కుటుంబాలు బీజేపీ వైపు తిప్పుకునేందుకు కృషి చేయాల్సి ఉంటుంది.