బీజేపీ కుట్రలో భాగంగానే కర్ణాటక సంక్షోభం... దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామన్న కాంగ్రెస్
కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుండే బీజేపీ టార్గెట్ చేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈనేపథ్యంలోనే స్వార్థ ప్రయోజనాల కోసం సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టారని ఆయన విమర్శించారు. కర్ణాటక అసెంబ్లీ పరిణామాల తర్వాత రాహుల్ గాంధీ ట్విట్టర్లో స్పందించారు. కాగా గతంలో బీజేపీకి అధికారం దక్కకుండా చేయడంలో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే...
అయితే కాంగ్రెస్ పార్టీ నుండే మెజారీటీ ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో ప్రభుత్వానికి అనుకూలంగా 99 మంది, వ్యతిరేకంగా 105 మంది ఓటు వేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్కు చెందిన 12 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు.. జేడీఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించి సభకు హజరు కాకుండా దూరంగా ఉన్నారు. అలాగే, కాంగ్రెస్కు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అనారోగ్య కారణాలతో సభకు దూరమయ్యారు. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా సభకు దూరంగా ఉండటంతోపాటు బీఎస్పీ ఎమ్మెల్యే సైతం సభకు దూరంగా ఉన్నారు. దీంతో అధికార పక్షానికి తగిన సంఖ్యాబలం లేని కారణంగా కుమార సర్కార్ కుప్పకూలింది.
మరోవైపు కర్ణాటక పరిణామాలపై దేశ వ్యాప్తంగా ఆందోళన నిర్వహించి, నిరసనలు వ్యక్తం చేస్తామని ఆపార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. బీజేపీ కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని విమర్శించిన ఆయన ఇందుకు నిరసగానే అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.