ట్రంప్ పర్యటన : మోదీపై కాంగ్రెస్ సెటైరికల్ పోస్టర్.. మామూలుగా లేదుగా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24,25 తేదీల్లో భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొతెరా స్టేడియం వరకు ట్రంప్,మోదీ కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు లక్ష మంది ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ట్రంప్కు స్వాగతం పలకనున్నారు. మరోవైపు దీనిపై ట్రంప్ మాట్లాడుతూ.. అహ్మదాబాద్లో 70లక్షల మందితో తనకు స్వాగతం పలకనున్నట్టు చెప్పడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ట్రంప్ పర్యటనపై సెటైర్స్ మొదలుపెట్టింది.
డొనాల్డ్ ట్రంప్ నాగరిక అభినందన సభ సందర్భంగా మోదీ హామీ ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల్లో 69లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో ఓ సెటైరికల్ పోస్టర్ను పోస్ట్ చేసింది. డొనాల్డ్ ట్రంప్ కోసం చప్పట్లు కొట్టేందుకు వీరందరినీ తీసుకోబోతున్నారని... వీరి వేతనం 'అచ్చే దిన్' అని పేర్కొంది. తేదీ,సమయం,వేదిక.. ఫిబ్రవరి 24,మధ్యాహ్నం 12గంటలకు మొతెరాలో స్టేడియానికి రావాల్సిందిగా తెలిపింది. కాంగ్రెస్ పెట్టిన ఈ సెటైరికల్ పోస్టర్పై నెటిజెన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు కాంగ్రెస్ పోస్టర్ను సమర్థిస్తుండగా.. మరికొందరు.. 'మరి కాంగ్రెస్ అధ్యక్ష పదవి భర్తీకి యాడ్ ఎప్పుడు ఇస్తున్నారు..' అని కౌంటర్ ఇస్తున్నారు.
కాగా,దేశంలో నిరుద్యోగంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పదేపదే బీజేపీని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ హయాంలో గత నాలుగు దశాబ్దాల్లో మునుపెన్నడూ లేనంత నిరుద్యోగం నెలకొందని,రైతాంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని రాహుల్ ఆరోపిస్తున్నారు. ఇటీవలి బడ్జెట్ కూడా నిరుద్యోగంపై ఎక్కడా ఫోకస్ చేయలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్వాగత ఏర్పాట్లకు, ఉద్యోగాల కల్పనకు ముడిపెడుతూ కాంగ్రెస్ సెటైరికల్ పోస్టర్ విడుదల చేసింది.
69 lakh vacancies of the 2 cr promised by Modiji have been announced. Apply now. Hurry! #Jumla7MillionKa pic.twitter.com/4jA27gQL16
— Congress (@INCIndia) February 22, 2020