బీజేపీ-అన్నాడీఎంకే తర్వాత... కాంగ్రెస్-డీఎంకే మధ్య సీట్ల చర్చ, 10 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ
చెన్నై: లోకసభ ఎన్నికల కోసం పొత్తులు పొడుస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య రెండు రోజుల క్రితం పొత్తు కుదిరింది. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయనున్నారో పత్రికాముఖంగా చెప్పారు. ఆ తర్వాత తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే, పీఎంకే మధ్య పొత్తు కుదిరింది. ఇప్పుడు తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ మధ్య పొత్తు పొడుస్తోంది.
తమిళనాడులో 39 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఈ మేరకు డీఎంకే, కాంగ్రెస్ పార్టీ నేతలు సీట్ల షేరింగ్ పైన చర్చలు జరిపారు. ఈ సందర్భంగా డీఎంకే చీఫ్ స్టాలిన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో 9 సీట్లలో పోటీ చేస్తుందని చెప్పారు. పుదుచ్చేరిలోను కాంగ్రెస్ బరిలో ఉంటుందన్నారు.
సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ పదహారు సీట్లు అడుగుతోంది. కానీ డీఎంకే అన్ని సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు.
తాము (డీఎంకే) ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో ఇంకా నిర్ణయించలేదని స్టాలిన్ చెప్పారు. మిగతా మిత్రపక్షాలతో భేటీ అనంతరం తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేసేది నిర్ణయించుకుంటామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ నేత వేణుగోపాల్ మాట్లాడుతూ.. తామంతా కలిసి ముందుకు సాగుతామని, మంచి విజయం సాధిస్తామని చెప్పారు. తమ కూటమి దాదాపు అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో పొత్తుపై రాహుల్ గాంధీ తమకు సూచనలు చేశారని, ఈ మేరకు డీఎంకేతో చర్చలు జరిపామని చెప్పారు.
వచ్చే లోకసభ ఎన్నికల్లో పలు పార్టీలతో కలిసి వెళ్లాలని డీఎంకే భావిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో చర్చించి, ఆ పార్టీకి పది సీట్లు ఇచ్చేందుకు సిద్ధపడింది. సీపీఐ, సీపీఐ(ఎం), వైకో నేతృత్వంలోని ఎండీఎంకే, వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ తదితర పార్టీలతో చర్చలు జరుపుతున్నారు.
తమిళనాడులో 39, పుదుచ్చేరిలో 1 సీటు ఉంది. కాంగ్రెస్ 10 స్థానాల్లో పోటీ చేస్తుండగా, డీఎంకే 25 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. మిగతా 5 స్థానాలు ఇతర మిత్రపక్షాలకు ఇచ్చే ఆలోచనతో ఉంది.