బాదం పప్పు, కంటి చుక్కల మందు : రుణమాఫీపై వ్యాఖ్యలతో శివరాజ్కు కాంగ్రెస్ గిఫ్ట్ ప్యాక్
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ రాజకీయాల రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ రైతుల రుణమాఫీ చేయలేదని మాజీ సీఎం, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. దీనికి కాంగ్రెస్ పార్టీ ధీటుగానే స్పందించింది. శివరాజ్ సింగ్ కు ఏకంగా గిప్ట్ ప్యాక్ పంపిస్తూ .. ధీటుగా కౌంటర్ ఇచ్చింది.
అమలుకానీ హామీ
ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రైతుల రుణమాఫీ ప్రధాన ఏజెండాగా హామీనిచ్చారు. రైతులు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ అంశాన్ని విస్మరించిందని శివరాజ్ సింగ్ ఆరోపించారు. దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. బాదం, కంటి చుక్కల మందు, చ్యావన్ ప్రశ్ పంపించారు.
చుక్కల మందు
అధికారం చేపట్టిన వెంటనే రైతు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కానీ శివరాజ్ మాత్రం అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఆయన కళ్లు మరింత చక్కగా పనిచేయాలని కంటి చుక్కల మందు పంపించామని గుర్తుచేశారు. అలాగే మతిమరపు పోవాలని బాదం పప్పు, చ్యావన్ ప్రశ్ పంపిస్తున్నామని పేర్కొన్నారు.
ఇవిగో ఆధారాలు ..
కేంద్ర ప్రభుత్వం ఆధారాలు చూపదని .. కానీ కాంగ్రెస్ రుజువులు చూపడంలో ముందుంటుందని ఆ పార్టీ నేతలు సురేశ్ పచౌరి, పీసీ శర్మ తెలిపారు. డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే 21 లక్షల మంది రైతుల రుణమాఫీ చేసినట్టు ఆధారాలు చూపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా రుణమాఫీ చేసినట్టు వారు వివరించారు.
మెసేజ్ వస్తే సరిపోతుందా ?
ఈ సాక్ష్యాలను శివరాజ్ సింగ్ తోసిపుచ్చారు. ఇవీ అబద్దాలని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన 2 గంటల్లో నెరవేరుస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ చెప్పారు. కానీ ఇంతవరకు అదీ నెరవేరలేదన్నారు. రైతులకు రుణమాఫీకి సంబంధించి సమాచారం అందింది .. కానీ ఎన్నికల కోడ్ వల్ల రుణం మాత్రం మాఫీ కాలేదన్నారు.