కేంద్ర మాజీ మంత్రి కుమార్తె మంత్రి పదవికి చెక్ పెట్టిన సిద్దరామయ్య కుమారుడు, ఒక్కటే !
బెంగళూరు: మహిళ కోటా, ఎస్సీ రిజర్వేషన్ లో ఏదో ఒక కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆశపడిన కోలారు జిల్లా కేజీఎఫ్ ఎమ్మెల్యే రూపా శశిధర్ కు చివరికి నిరాశ మిగిలింది. కాంగ్రెస్ హైకమాండ్ కు అత్యంత సన్నిహితుడు అయిన రూపా శశిధర్ తండ్రి, కేంద్ర మాజీ మంత్రి, కోలారు కాంగ్రెస్ ఎంపీ కేహెచ్. మునియప్ప చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
కేంద్ర మాజీ మంత్రి కేహెచ్. మునియప్ప కుమార్తె రూపా శశిధర్ మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన కుమార్తె కు ఎస్సీ రిజర్వేషన్ ఉందని, మహిళా కోటాలో అయినా మంత్రి పదవి ఇప్పించాలని కేహెచ్. మునియప్ప హైకమాండ్ మీద ఒత్తిడి తీసుకువచ్చారు.
కేహెచ్. మునియప్ప కుమార్తె రూపా శశిధర్ కు మంత్రి పదవి గ్యారెంటీ అని అందరూ భావించారు. మంగళవారం సాయంత్రం కోలారులో కేహెచ్. మునియప్ప అనుచరులు రూపా శశిధర్ కు మంత్రి పదవి వస్తుందని పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు.
బుధవారం మంత్రి వర్గం జాబితాలో రూప శశిధర్ పేరు లేకపోవడంతో కేహెచ్. మునియప్ప అనుచరులు నిరాశకు గురైనారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు, మైసూరు జిల్లా వరుణ నియోజక వర్గం ఎమ్మెల్యే డాక్టర్ యతీంద్ర కారణంగా రూపా శశికధర్ కు మంత్రి పదవి రాలేదని సమాచారం.
సిద్దరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర, కేహెచ్. మునియప్ప కుమార్తె రూపా శశిధర్ మొదటి సారి ఎమ్మెల్యేలు అయ్యారు. రూపా శశిధర్ కు మంత్రి పదవి ఇస్తే తన కుమారుడు యతీంద్రకు మంత్రి పదవి ఇవ్వాలని సిద్దరామయ్య హైకమాండ్ ముందు డిమాండ్ చేశారని తెలిసింది.
ఒకరికి ఇచ్చి మరోకరికి మంత్రి పదవి ఇవ్వపోతే లేనిపోని సమస్యలు వస్తాయని రూపా శశిధర్, డాక్టర్ యతీంద్రను పక్కన పెట్టారని తెలిసింది. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖార్గే కుమారుడు ప్రియాంక్ ఖార్గే మాత్రం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.