సజ్జన్ మెడకు సిక్కుల ఊచకోత కేసు.. కాంగ్రెస్ పార్టీకి గుడ్బై
ఢిల్లీ : సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా నిరూపితమైన కాంగ్రెస్ సీనియర్ లీడర్ సజ్జన్ కుమార్ పార్టీకి దూరమయ్యారు. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి లేఖ పంపించారు. 1984 నాటి సిక్కుల ఊచకోత కేసులో సజ్జన్ కుమార్ ను దోషిగా ప్రకటిస్తూ సోమవారం ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆయనను దోషిగా తేలుస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
1984 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని సిక్కు మతస్థులైన బాడీగార్డ్స్ కాల్చి చంపడంతో.. దేశవ్యాప్తంగా సిక్కుల ఊచకోత జరిగింది. ఆ సమయంలో ఢిల్లీలోని రాజ్ నగర్ ఏరియాలో ఐదుగురు సిక్కులను చంపేశారు. అప్పుడు సజ్జన్ కుమార్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. అయితే సిక్కుల ఊచకోతకు సంబంధించిన కేసులో ఆయనతో పాటు మరో ఆరుగురు నిందితులున్నారు.
2013 సంవత్సరంలో సజ్జన్ కుమార్ నిర్దోషిగా బయటపడినప్పటికీ.. ఆ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు బాధితులు. దీంతో విచారణ మొదలుపెట్టిన న్యాయస్థానం సజ్జన్ కుమార్ ముమ్మాటికీ దోషియేనంటూ తీర్పు వెలువరించింది. అయితే నేరం రుజువు కావడంతో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు సజ్జన్ కుమార్.