మహనీయులకు ప్రాంతీయత అంటగట్టింది కాంగ్రెస్సే..! గుజరాత్ ఎన్నికల ప్రచారంలో నిప్పులు చెరిగిన మోదీ..!!
Recommended Video
జునాగఢ్/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ పై ప్రధాని నరేంద్ర మోదీ మరో సారి విరుచుకు పడ్డారు. ఎక్కువ సంవత్సరాలు పరిపాలించి కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం ఒరగబెట్టిందో ఇంకా ప్రశ్నార్థకంగానే ఉందని మోదీ అన్నారు. సొంత రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు సంధించారు. దేశంలోని మహానుభావులకు ప్రాంతీయత అంటగట్టిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మండిపడ్డారు. సుధీర్గ కాలం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ కు, తక్కువ కాలం పని చేసిన బీజేపి ట్రాక్ రికార్డ్ కు చాలా వ్యత్యాసం ఉందని మోదీ పేర్కొన్నారు.
కశ్మీర్ సమస్యకు కాంగ్రెస్సే కారణం..! గుజరాత్ లో ఘాటుగా విమర్శలు చేసిన మోదీ..!!
ఎన్నికల ప్రచారంలో భాగంగా సొంత రాష్ట్రంలో పర్యటిస్తున్న మోదీ గుజరాతీ ఆత్మాభిమానాన్ని వల్లే వేశారు. గుజరాతీలు కావడం వల్లే మొరార్జీ దేశాయ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ను కాంగ్రెస్ చిన్నచూపు చూసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య పోరాటంలో వల్లభాయ్ సేవల్ని గుర్తుచేశారు. పటేల్ వల్లే దేశం ఐక్యంగా ఉందన్నారు. ఒక్క కశ్మీర్ అంశాన్ని మాత్రం పటేల్.. నెహ్రూకు వదిలేశారన్నారు. ఆ తప్పే ప్రస్తుత పరిస్థితులకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏది ట్రాక్ రికార్డో.. ఏది టేప్ రికార్టో తెలుసుకోవాలి..! కాంగ్రెస్ పై విమర్శల పదును పెంచిన మోదీ..!!
ఛాయ్వాలా ఐదేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకోవడాన్ని గాంధీ-నెహ్రూ కుటుంబం సహించలేకపోతుందని వ్యాఖ్యానించారు. ప్రజలు మా(భాజపా) ‘ట్రాక్ రికార్డ్'ని..వారి(కాంగ్రెస్) ‘టేప్ రికార్డ్'ని గమనించాలి. ఉగ్రవాదం, అభివృద్ధి, పేదరికంపై దృష్టి సారించిన ట్రాక్ రికార్డ్ మాదైతే.. ‘మోదీజీ హఠావో' అనే ఏకైక గీతంతో వారి టేప్ రికార్డ్ మోగుతోంది అని మోదీ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ కు ఏ లక్ష్యం లేదు..! బీజేపి ని విమర్శించడమే ఆ పార్టీ లక్ష్యమన్న మోదీ..!!
తనని గద్దె దించడం తప్ప కాంగ్రెస్కు మరో లక్ష్యమే లేదని మోదీ విమర్శించారు. వారి అవినీతి జాబితాలో మరో కొత్త అంశం చేరిందన్నారు. అదే ‘తుగ్లక్ రోడ్డు ఎన్నికల స్కామ్' అని.. పేద, గర్భిణీ మహిళల కోసం కేటాయించిన డబ్బును లూటీ చేశారని ఆరోపించారు. పరోక్షంగా ఇటీవల మధ్యప్రదేశ్లో జరిగిన ఐటీ సోదాల్లో లభ్యమైన భారీ సొమ్మును ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశం బీజేపి వైపు చూస్తోందన్న మోదీ..! 2014 ఫలితాలే వస్తాయన్న చౌకీదార్..!!
కర్ణాటక తరవాత కాంగ్రెస్కు మధ్యప్రదేశ్ ఏటీఎంగా మారిందన్నారు. అలాగే జమ్మూకశ్మీర్ వేర్పాటుకు, ప్రత్యేక ప్రధాని నినాదానికి కాంగ్రెస్ మద్దతిస్తోందని ఆయన ఆరోపించారు. పాక్లో వైమానిక దాడులు జరిపితే భారత్లోని ప్రతిపక్షాలు దెబ్బతిన్నాయని ఎద్దేవా చేశారు. గుజరాత్లో 2014 ఫలితాలే పునరావృతం కావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. 26 లోక్సభ స్థానాలున్న గుజరాత్లో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి.