ఇదేనా మోడీ న్యూఇయర్ గిఫ్ట్: రైల్వే, ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపుపై విపక్షాల ఫైర్
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం కానుకగా మోడీ సర్కార్ రైల్వే టికెట్ ధరలు, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి సామాన్యుడికి అందించ్చిందని విమర్శలు గుప్పించింది కాంగ్రెస్. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నంగా ఉన్న పరిస్థితుల్లో ధరల పెంపు ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుష్మితా దేవి. పేద ప్రజలకు ఈ పెంపు కచ్చితంగా భారంగా మారుతుందని అన్నారు. ఈ సమస్య ఎప్పుడు ముగుస్తుందని ఆమె ప్రశ్నించారు. సామాన్యుడికి మోడీ ప్రభుత్వం కొత్తసంవత్సర కానుక ఇదేనా అని ప్రశ్నించింది కాంగ్రెస్.
డిసెంబర్ 31న రైల్వే టికెట్ చార్జీల ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కిలోమీటరుకు ఒక పైసా నుంచి 4 పైసల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్పై రూ.19 పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్తో పాటు ధరల పెంపుపై మండి పడింది సీపీఐఎం. ప్రజల జీవితాలతో మోడీ సర్కార్ పరాచకాలాడుతోందని సీతారాం ఏచూరి మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం కొత్త సంవత్సరంలో ధరలు పెంచేందుకు నిర్ణయం తీసుకుందని చెప్పిన సీతారాం ఏచూరి... ఇప్పటికే ఉద్యోగాల కల్పనలో విఫలమైందని, నిత్యావసర ధరలు పెరిగాయని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సంపాదన లేకుండా ఈ సర్కార్ చేసిందని దుయ్యబట్టారు.
రైల్వే టికెట్ ధరల పెంపు మోడీ ప్రభుత్వం ఇచ్చిన న్యూఇయర్ గిఫ్ట్ అంటూ మరో ట్వీట్ చేశారు సీతారాం ఏచూరి. నాన్ ఏసీ క్లాస్పై కిలోమీటరుకు 1పైసా పెంచగా మెయిల్/ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ క్లాస్లపై కిలోమీటరుకు 2 పైసలు పెంచింది. ఇక ఏసీ క్లాస్లో ప్రయాణించేవారికి కిలోమీటరుకు 4 పైసలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మరోవైపు లోకల్ ట్రైన్స్లో మాత్రం ఎలాంటి టికెట్ ఛార్జీలను పెంచలేదు.
Modi govt starts the year. After railway passenger fare hikes, another attack on peoples’ livelihoods. All this In the wake of sharp job losses, food price inflation and record fall in rural wages. https://t.co/WJjNJI7BVT
— Sitaram Yechury (@SitaramYechury) January 1, 2020
రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన వసతులు, సదుపాయాలు కల్పించేందుకు తప్పని పరిస్థితుల్లో రైల్వే టికెట్ ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని కేంద్రం చెప్పుకొచ్చింది. అయితే ఈ పెంపు పెద్దగా భారంగా మారదని స్పష్టం చేసింది. టికెట్ ఛార్జీల పెంపుతో రైల్వేల ఆధునీకీకరణ వేగంగా జరుగుతుందని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే జనవరి 1, 2020 కి ముందు టికెట్ బుక్ చేసుకున్న వారిపై ఈ ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.