యూపీలో బీజేపీ గెలవదు.. అది ఆ పార్టీకి కూడా అర్థమైంది: మాయావతి
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రాదని, ఆ విషయం ఇప్పటికే బీజేపీకి అర్థమైందని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు.
లక్నో: వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలన్ని తమ శక్తి మేరకు గెలుపు వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ యూపీలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.
తాజాగా దీనిపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రాదని, ఆ విషయం ఇప్పటికే బీజేపీకి అర్థమైందని మాయావతి విమర్శించారు. సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ తరహాలోనే ప్రధాని మోడీ కూడా అసత్య ప్రకటనలు చేస్తున్నారని మాయావతి మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు ఎన్నో హామిలను ఇచ్చిన మోడీ ఉత్తరప్రదేశ్ లో వాటిని అమలుపరచడంలో విఫలమయ్యారని మాయావతి అన్నారు. మోడీ ఇచ్చిన హామిల్లో ఏ ఒక్కటి రాష్ట్రంలో అమలు కాలేదని, ప్రజలంతా మోడీ పాలనపై అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.
ఎస్పీ-కాంగ్రెస్ పొత్తుపై ఎద్దేవా:
ఎస్పీ-కాంగ్రెస్ మధ్య పొత్తు బీజేపీ ఆమోదం పొందిన తర్వాతే జరుగుతుందని మాయావతి ఎద్దేవా చేశారు.బీజేపీకి లబ్దిచేకూరే అవకాశం ఉంటేనే ఆ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడుతాయని అన్నారు. ఈడీ,ఐటీ,సీబీఐ అధికారుల సహాయం తీసుకుంటూ కాంగ్రెస్ తో కూటమిని ఏర్పాటు చేయాలని బీజేపీ ములాయం సింగ్పై ఒత్తిడి తెస్తోందని మాయావతి ఆరోపించారు.