గవర్నర్ జీ ఒక్క ఛాన్స్ ప్లీజ్: గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ వినతిపత్రం
గోవా: గోవాలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయా..? సీఎం మనోహర్ పారికర్ అనారోగ్యంతో సీఎం పీటంకు బీటలు పడ్డాయా..? సొంత పార్టీలోనే కాక మిత్రపక్షాలు ఆ కుర్చీ కోసం ప్రయత్నాలు ప్రారంభించాయా... అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. నిన్నటి వరకు మిత్ర పక్షాలు సీఎం కుర్చీ కోసం పాకులాడినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కాంగ్రెస్ కూడా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే గోవా రాష్ట్రానికి చెందిన 14 కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆ రాష్ట్ర గవర్నర్ మృదులాసిన్హాను కలిసి వినతిపత్రం అందజేసేందుకు రాజ్భవన్కు వెళ్లారు. అయితే గవర్నర్ రాజ్భవన్లో లేనందున కార్యక్రమాన్నిమంగళవారానికి వాయిదా వేసుకున్నారు.
గోవా తదుపరి సీఎంపై బీజేపీలో చర్చ...చికిత్స కోసం ఢిల్లీకి మనోహర్ పారికర్
40 సీట్లున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ బలనిరూపణ చేసుకునేందుకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా వారు గవర్నర్ను కోరనున్నారు. అసెంబ్లీని రద్దు చేయకుండా కాంగ్రెస్కు ఒక అవకాశం ఇవ్వాలని తమవద్ద ప్రభుత్వం ఏర్పాటుకు తగిన సంఖ్యాబలం ఉందని చెప్పనున్నారు. ప్రజలు ఐదేళ్లు పాలించాల్సిందిగా తమ తీర్పును వెల్లడించారని... ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వంతో చేతకాకపోతే తాము ప్రభుత్వంలోకి వస్తామని కాంగ్రెస్ నేత బాబు కవెల్కర్ అన్నారు. తమది సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ.. కుట్రలతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రస్తుతం గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 16 మంది ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తమకు మరో ఐదు మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యం సరిగ్గా లేనందున ఆయన చికిత్స కోసం ఢిల్లీలో ఉన్నారు. దీంతో పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతుండటంతో... ఢిల్లీ నుంచి బీజేపీ అధిష్టానం తరపున దూతలు గోవాకు వచ్చారు. మనోహర్ పారికర్ వద్ద ఉన్న పోర్ట్ఫోలియోలను ఇతరులకు కేటాయించేందుకు వారు గోవాకు చేరుకున్నారు. బీఎల్ సంతోష్, రామ్లాల్, వినయ్ పురానిక్లను అమిత్ షా దూతలుగా గోవాకు పంపారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం స్మూత్గా నడవాలంటే శాశ్వత ముఖ్యమంత్రి అవసరమని కాంగ్రెస్ వాదిస్తోంది.
మనోహర్ పారికర్కు ఆరోగ్యం సహకరించనందున తన పదవిని ఎవరైనా సీనియర్ మంత్రికి అప్పజెప్పాలని మిత్రపక్షం మహారాష్ట్రవాడి గోమంతక్ పార్టీ అధినేత దీపక్ ధవలికర్ అన్నారు. మరోవైపు కొత్త సీఎం అభ్యర్థి గురించి పార్టీలో చర్చ జరుగుతోందా అన్న ప్రశ్నకు ... పారికర్ ఇక బాధ్యతలు నిర్వర్తించలేను అన్న సమయంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని మరో సీనియర్ ఎమ్మెల్యే లోబో అన్నారు.