అయ్యర్ను కావాలనే తొలగించింది: కాంగ్రెస్, సోనియాలపై ఉమాభారతి ఫైర్
మథుర: ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మణిశంకర్ అయ్యర్ను కాంగ్రెస్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన పార్టీకి భారంగా మారిన నేపథ్యంలో కావాలనే వదిలించుకున్నారని కాంగ్రెస్ పార్టీనుద్దేశించి కేంద్రమంత్రి ఉమాభారతి అన్నారు.
ఈ మేరకు మీడియాలతో మాట్లాడుతూ.. పార్టీకి భారంగా మారిన నేపథ్యంలో ఎప్పట్నుంచో అయ్యర్ను వదిలించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని, అవకాశం దక్కడంతో సులువుగా ఆయనను పక్కన పెట్టారని అన్నారు.
కాంగ్రెస్ నిజంగా విలువలు పాటించే పార్టీనే అయితే తొలుత పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని సస్పెండ్ చేయాలని సూచించారు. 2014 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆమె ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు.
అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే పనులు ఆలస్యమవుతున్నాయని నదుల సంరక్షణ గురించి మాట్లాడుతూ చెప్పారు. నదుల సంరక్షణలో రాజీ ఉండబోదమని స్పష్టం చేశారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ పాలనలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని ప్రశంసించారు.