బైపోల్: రాజస్థాన్లో బీజేపీకి దెబ్బ, కాంగ్రెస్ గెలుపు, బెంగాల్లో 2స్థానాలు టిఎంసి కైవసం
న్యూఢిల్లీ: దేశంలోని రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు విజయకేతనం ఎగురవేశాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్లో అధికారంలో బీజేపీ ప్రభుత్వానికి కీలక ప్రాంతాలైన అజ్మేర్, అల్వార్లో ఆ పార్టీ ఓటమి చవిచూసింది.
ఇటీవల ఆయా లోకసభ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరిగింది. ఈ ఫలితాల్లో బీజేపీ రెండు లోకసభ స్థానాలను, ఒక అసెంబ్లీ స్థానాన్ని కోల్పోయింది. ఈ ఏడాదిలో రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంగా ఆ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోవడం గమనార్హం.
అల్వార్ లోకసభ స్థానానికి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి జశ్వంత్ యాదవ్పై కాంగ్రెస్ అభ్యర్థి కరణ్ సింగ్ 1,56,319 ఓట్ల తేడాతో గెలుపొందారు. మందల్గఢ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ధకద్ గెలిచారు. ఆయన తన బీజేపీ ప్రత్యర్థిపై 13వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. మరో లోకసభ స్థానం అజ్మేర్ను కూడా బీజేపీ కోల్పోయింది..
బెంగాల్ రాష్ట్రంలోని ఉల్బేరేనియా లోక్ సభ స్థానంలో టిఎంసి అభ్యర్థి విజయం సాధించారు. టిఎంసి అభ్యర్థికి 2,35,885 ఓట్లు వచ్చాయి, బిజెపికి 1,38,229 ఓట్లు వచ్చాయి, సిపిఎం అభ్యర్థికి 71,300 ఓట్లు మాత్రమే వచ్చాయి. అనుహ్యంగా ఈ స్థానంలో బిజెపి రెండో స్థానంలో నిలిచింది.
బెంగాల్ రాష్ట్రంలోని నోపారా అసెంబ్లీ సెగ్మెంట్ లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి 63018 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
నోపారాలో టిఎంసి అభ్యర్థికి 1,11,729 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థికి 38,711 ఓట్లు, సిపిఎం అభ్యర్థికి35,497 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 10,527 ఓట్లు లభించాయి.