కర్ణాటకలో మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు: హోంమంత్రిత్వ శాఖకు బీజేపీ ఎంపీ లేఖ
బెంగళూరు: కన్నడ ఓటరు ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ కట్టబెట్టకపోవడంతో.. 'నంబర్ గేమ్'పై క్షణక్షణం ఉత్కంఠ సాగుతోంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి అవకాశం ఇవ్వాలా? లేక కాంగ్రెస్ జేడీఎస్ లను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలా? అన్న మీమాంసలో గవర్నర్ వజుభాయ్ వాలా న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు.
ఇదంతా పక్కనపెడితే.. అధికార పీఠం కోసం ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను కదలించాలనే ప్రయత్నాలు కూడా కర్ణాటకలో ముమ్మరం అయ్యాయి. ఈ నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు కూడా జోరందుకున్నాయి. బీజేపీ రూ.100కోట్లు ఆఫర్ చేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తోందని జేడీఎస్ సీఎం అభ్యర్థి కుమారస్వామి బహిరంగంగానే ఆరోపించారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఉండటంతో.. ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేయిస్తోందని బీజేపీ ఎంపీ శోభా కరాండ్లజే ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఆమె ఓ లేఖ కూడా రాశారు.
#KarnatakaKurukshetra: BJP's #ShobhaKarandlaje accuses Cong leaders of tapping call b/w her & #GMSiddeshwara. Not only hers, Shobha accuses Cong leaders of tapping phones of #PCMohan & #ArvindLimbavalli. Complaint lodged with Central Home Ministry. pic.twitter.com/F1pQXQsKXv
— NEWS9 (@NEWS9TWEETS) May 16, 2018
'కర్ణాటక ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్న ప్రతీదానికి మా వద్ద ఆధారాలున్నాయి. మా ఫోన్లను ట్యాప్ చేయిస్తూ వ్యక్తిగత హక్కులకు ప్రభుత్వం విఘాతం కలిగిస్తోంది' అని ఆమె లేఖలో పేర్కొన్నారు.
ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా కూడా వెల్లడించారు.తనకు జీఎం సిద్దేశ్వరకు మధ్య జరిగిన సెల్ ఫోన్ సంభాషణను కాంగ్రెస్ నేతలు ట్యాపింగ్ చేశారని ఆమె తన ట్వీట్ లో ఆరోపించారు. అలాగే పీసీ మోహన్, అరవింద్ లింబవల్లికి మధ్య ఫోన్ సంభాషణ కూడా ఫోన్ ట్యాపింగ్ అయిందని ఆమె ఆరోపించారు.
ఏదేమైనా కన్నడనాట సుస్థిర ప్రభుత్వం కొలువుదీరే దాకా ఇలాంటి వివాదాలు, ఆరోపణలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.