విరాట్ కోహ్లీ ఎఫెక్ట్: మోడీకి రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ కొత్త సవాల్!
Recommended Video
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా చేసిన ఛాలెంజ్ను ప్రధాని మోడీ స్వీకరించారు. అందుకు సంబంధించిన వీడియో త్వరలోనే పోస్ట్ చేస్తానని మోడీ ట్వీట్ చేశారు. కేంద్ర క్రీడా మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ దేశ ప్రజలకు ట్విట్టర్లో ఫిట్నెస్ సవాల్ విసిరారు.
స్వయంగా బస్కీలు తీస్తున్న తన వీడియోను అప్ లోడ్ చేశారు. అంతేకాకుండా కోహ్లీ, ఏస్ షట్లర్ సైనా, హీరో హృతిక్ రోషన్లకు సవాల్ చేశారు. వారు వర్కవుట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు పోస్టు చేయాలని కోరారు. రాథోడ్ సవాల్ను అందరూ స్వీకరించారు. కోహ్లీ కూడా సవాల్ స్వీకరించి ప్రధానికి ట్యాగ్ చేశారు. ప్రధాని ఆ సవాల్ను స్వీకరించారు.
అయితే, దీనిపై కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందించారు. 'కోహ్లీ ఫిట్నెస్ ఛాలెంజ్ను మీరు స్వీకరించడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే నా ఛాలెంజ్ను కూడా స్వీకరించాలని కోరుతున్నా.. యువతకు ఉద్యోగాలు కల్పించండి. రైతులకు ఊరటనివ్వండి. దళితులు, మైనార్టీలపై హింస జరగకుండా చూస్తామంటూ హామీ ఇవ్వండి. నరేంద్ర మోడీ సర్.. మరి నా ఛాలెంజ్ను స్వీకరిస్తారా?' అని తేజస్వీ రాజకీయ కోణంలో ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ నేత రణ్దీప్ సుర్జేవాలా కూడా మోడీకి ఓ ట్వీట్ చేశారు. 'చమురు ధరలు వరుసగా 11వ రోజు పెరిగాయి. అయినా ప్రధాని మౌనంగానే ఉన్నారు. ఇక ఆయన కేబినెట్లోని కేంద్రమంత్రులేమో చమురు ధరలు తగ్గిస్తే సంక్షేమ పథకాలు చేపట్టలేమంటూ హెచ్చరిస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఎక్సైజ్ రూపంలో దోచుకున్న రూ.10లక్షల కోట్లను ఇంధన ధరలు తగ్గించేందుకు ఉపయోగిస్తారా? ఈ దేశ ఛాలెంజ్ను మోడీ గారు స్వీకరిస్తారా?' అంటూ ట్వీట్ చేశారు.
రాహుల్ గాంధీ కూడా స్పందించారు. 'డియర్ పీఎం, విరాట్ కోహ్లీ ఛాలెంజ్ అంగీకరించినందుకు సంతోషం. నేను మీకో ఛాలెంజ్ చేస్తున్నాను. పెట్రో ధరలు తగ్గించండి లేకపోతే జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది. పెట్రో ధరలు తగ్గించాలని మీపై ఒత్తిడి చేస్తున్నాం. మీ ప్రతిస్పందన కోసం నేను ఎదురుచూస్తున్నాను' అంటూ ఫ్యుయల్ ఛాలెంజ్ అనే ట్యాగ్ లైన్తో ట్వీట్ చేశారు.