ట్రబుల్ షూటర్.. బిగ్ ట్రబుల్: తీహార్ జైలుకే: బెయిల్ పిటీషన్ పై కాస్సేపట్లో విచారణ
న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి మరో హైఓల్టేజ్ షాక్. పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ ను పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. మనీ ల్యాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయనను గురువారం ఉదయం ఆసుపత్రి నుంచి నేరుగా తీహార్ జైలుకు తీసుకెళ్లారు. విచారణ కొనసాగుతున్న సమయంలో అనారోగ్యానికి గురైన డీకే శివకుమార్ ఇటీవలే దేశ రాజధానిలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం కుదుట పడినట్లు డాక్టర్ల వెల్లడించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు ఢిల్లీ పోలీసులు. కాంగ్రెస్ పార్టీకే చెందిన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరం ప్రస్తుతం తీహార్ జైలులోనే విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. డీకే శివకుమార్ ను కూడా అక్కడికే తరలించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మూడువారాలుగా కస్టడీలో..
సుమారు 600 కోట్ల రూపాయల అదనపు ఆస్తులను కలిగి ఉన్నారన్న అభియోగాలను ఎదుర్కొంటున్నారు డీకే శివకుమార్. పెద్ద ఎత్తున మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారంటూ ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. వాటిని నమోదు చేసుకున్న సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. న్యూఢిల్లీలోని సీబీఐ, ఈడీ ప్రధాన కార్యాలయాల్లో మూడు వారాలుగా ఆయనను విచారిస్తున్నారు. ఇందులో భాగంగా.. డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్యను కూడా ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. బెంగళూరులోొని సదాశివ నగరలో నివసిస్తోన్న డీకే శివకుమార్ ఇంటికి వెళ్లి మరీ ఆయన కుమార్తెకు సమన్లను జారీ చేశారు. 22 సంవత్సరాల వయస్సులోనే 78 కోట్ల రూపాయల నగదు ఐశ్వర్య పేరు మీద ఉన్నట్లు గమనించారు.
నాలుగురోజుల కిందట ఆసుపత్రిలో..
హైబీపీ, హైలెవెల్ షుగర్ తో బాధపడుతున్న ఆయన శనివారం న్యూఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స తీసుకున్నారు. ఈ ఉదయం రక్తపోటు, షుగర్ సాధారణ స్థితికి చేరుకున్నట్లు ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు. దీనితో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆసుపత్రి నుంచి నేరుగా తీహార్ జైలుకు తరలించారు. ఈడీ, సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న ఆయన కస్టడీని ఢిల్లీలోని రోజ్ అవెన్యూ న్యాయస్థానం వచ్చేనెల 1వ తేదీ వరకు పొడిగించాలని అధికారులు కోరుతున్నారు. కస్టడీని పొడిగించాల్సి వస్తే డీకే శివకుమార్ ను ఇక ప్రధాన కార్యాలయానికి బదులుగా తీహార్ జైలులో ఉంచి విచారణను కొనసాగించబోతున్నారనేది స్పష్టమైంది.
బెయిల్ పిటీషన్ పై విచారణ నేడే..
తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ డీకే శివకుమార్ చేసుకున్న దరఖాస్తును ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం మరి కొన్ని గంటల్లో విచారించబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ పిటీషన్ పై ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ విచారణ నిర్వహించనున్నారు. డీకే శివకుమార్ తరఫున కాంగ్రెస్ సీనియర్ నేతలు, ప్రధాన న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, ముకుల్ రోహత్గీ వాదించనున్నారు. డీకే శివకుమార్ ను సుమారు మూడు వారాలకు పైగా కస్టడీలో ఉంచి విచారరిస్తున్నారని, ఇన్నిరోజులు గడిచినప్పటికీ.. సీబీఐ గానీ, ఈడీ గానీ మనీ ల్యాండరింగ్ కు సంబంధించిన ఎలాంటి సాక్ష్యాధారాలను సాధించలేకపోయారని మను సంఘ్వీ, ముకుల్ రోహత్గీ చెబుతున్నారు. ఇదే వాదనను తాము న్యాయస్థానంలో వినిపిస్తామని అంటున్నారు. సీబీఐ, ఈడీ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎన్ కే మట్టా, నితీష్ రాణా వాదించబోతున్నారు. బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందనే అనుమానాలను వ్యక్తం చేశారు. విచారణ కీలక దశకు చేరుకుందని, ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం వల్ల కేసు మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉందని సీబీఐ, ఈడీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.