మధ్యప్రదేశ్ రణభేరి: బీజేపీపై అగ్రకులాలు అసహనం... క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్ యత్నం
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే బీఎస్పీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం కావడంతో కాంగ్రెస్ ఎలాగైనా ఆ రాష్ట్రంలో పాగావేయాలన్న ఆలోచనలతో అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవడం లేదు హస్తం పార్టీ. ఇందులో భాగంగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్.
అగ్రకులాల ఓట్లపై కన్నేసిన కాంగ్రెస్
మధ్యప్రదేశ్లో పాగా వేసేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే అక్కడి అగ్రకులాలకు చెందిన నేతలతో సమావేశమవుతోంది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్కు వ్యతిరేకతతో ఉన్న అగ్రకులాల ఓటర్లపై దృష్టిసారించిన కాంగ్రెస్ వారిని మచ్చిక చేసుకునే పనిలో పడింది. ఇప్పటికే శివరాజ్పై కొన్ని అగ్రకులాల వారు ఆగ్రహంతో ఉన్నారన్న సంగతిని పసిగట్టిన కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే వారికి చేయబోయే పనులగురించి వివరిస్తోంది. ఇక వీరితో భేటీ అవుతున్న కాంగ్రెస్ నేతల్లో ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కమల్ నాథ్, జోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్, సురేష్ పచౌరీలు ఉన్నారు.
బీజేపీ మమ్మలను మరిచింది.. కాంగ్రెస్ మమ్మలను కావాలనుకుంటోంది
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అగ్రకులాల వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో వివరిస్తున్నారు నేతలు. అంతేకాదు అగ్రకులాలకు చెందిన నేతల వ్యక్తిగత పనులను కూడా చక్కబెడుతుండటంతో వారు ఒక్కింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నేతలను సంతోషపరిస్తే వారి కులాలకు సంబంధించిన ఓట్లు తమవైపు మరల్చుకోవచ్చనే భావనతో కాంగ్రెస్ ముందుకెళుతోంది. అంతేకాదు తమ బాధలను ఏపార్టీ పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ తమ వద్దకు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు అగ్రకులాలకు చెందిన నేతలు.
ఇది కులాల వారీగా మధ్యప్రదేశ్లో లెక్కలు
ఇక బీఎస్పీతో తాము జట్టుకట్టడం లేదనే సంకేతాలు అగ్రకులాలకు చెందిన నాయకులకు కాంగ్రెస్ పంపుతోంది. అయితే ఇక్కడ ప్రభుత్వం చేపట్టాలంటే 2.5 శాతం ఉన్న అగ్రకులాల ఓట్లే చాలా కీలకం కానున్నాయి. ఏపార్టీ అయితే ఈ ఓట్లను తమవైపు మరల్చుకుంటుందో అదే పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మొత్తానికి మధ్యప్రదేశ్లో 13శాతం అగ్రకులాలకు చెందిన జనాభా ఉండగా ఇందులో 5.7శాతం బ్రాహ్మణ సామాజిక వర్గం, 5.3శాతం రాజ్పుట్ సామాజిక వర్గం, 2 శాతం బైష్యా సామాజిక వర్గం ఉండగా... 42శాతం ఓబీసీ కులాలకు చెందిన వారున్నారు. 14శాతం షెడ్యూల్ కులాలు,22 శాతం షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు.
నోటాకు వేయడంకంటే కాంగ్రెస్కు ఓటే వేయాలన్న నిర్ణయం
వింధ్యప్రదేశ్ ప్రాంతంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు దాదాపు 14శాతం మంది ఉన్నారు.. ఇక మధ్యభారతంలో రాజ్పుత్లు 9శాతంగా ఉన్నారు.ఇక్కడే బీజేపీకి ఇబ్బందులు ఎదురవుతుండగా దీన్నే కాంగ్రెస్ క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. అయితే అగ్రకులాలు వారు బీజేపీ పై అసహనంతో ఉన్నారు. ఈ క్రమంలోనే వారు ముందుగా నిర్ణయించుకున్నట్లుగా నోటాకు ఓటు వేయకుండా తమ ఓటును వృథా కానీయకుండా కాంగ్రెస్కు వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే బీజేపీకి ఇక్కడ చిక్కులు తప్పేలా లేవు.