నాగాలాండ్లో బీజేపీకి షాక్: ఎన్పీఎఫ్తో జత కట్టేందుకు కాంగ్రెస్ సై?
న్యూఢిల్లీ: కేంద్రంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నానాటికి ప్రాభవం కోల్పోతోంది కాంగ్రెస్ పార్టీ. అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కమలం పార్టీని అష్టకష్టాల పాల్జేసిన 'హస్తం' పార్టీ నాయకత్వం.. ఈశాన్య భారతంలో కోల్పోయిన పట్టును తిరిగి సాధించే దిశగా చర్యలు చేపట్టిందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అందుకోసం ఈ నెల 27వ తేదీన జరిగే నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని తలపోస్తున్నదా? అంటే పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. ఇందుకోసం అధికార నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) నాయకత్వంతో అనధికారికంగా కాంగ్రెస్ పార్టీ నేతలు సంప్రదింపులు జరిపినట్లు వార్తలొస్తున్నాయి.
ఐదుగురి నామినేషన్ల ఉపసంహరణతో బరిలో 18 మంది అభ్యర్థులే
60 స్థానాల నాగాలాండ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో వివిధ కారణాల రీత్యా కాంగ్రెస్ పార్టీ 23 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను నిలుపనున్నట్లు ప్రకటించింది. కానీ నామినేషన్ల ఉపసంహరణ నాటికి మరో ఐదుగురు సభ్యులు పక్కకు తప్పుకున్నారు.
రియో - బీజేపీ కూటమిని నిలువరించేందుకు కాంగ్రెస్ కసరత్తు
అయినా నాగాలాండ్లో మాజీ సీఎం రియో ఆధ్వర్యంలో స్థాపించిన నేషనల్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ), బీజేపీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా నిలువరించేందుకు కసరత్తు చేపట్టిందని తెలుస్తోంది. అధికార ఎన్పీఎఫ్ 58 స్థానాల్లో పోటీ చేస్తున్నది. ఇందుకోసం ఎన్పీఎఫ్ నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీ నేతలు సంప్రదిస్తున్నారు.
ఎన్పీఎఫ్తో కాంగ్రెస్ పార్టీకి పొత్తు లేదు
ఇక రియో సారథ్యంలోని నాగాలాండ్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ), బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, ఎన్పీఎఫ్తో ఎటువంటి ఎన్నికల పొత్తు కుదుర్చుకోలేదు. కానీ బీజేపీ - ఎన్డీపీపీ కూటమిని అధికారానికి దూరంగా పెట్టేందుకు ఎన్పీఎఫ్తో సంప్రదింపులు జరుపుతున్నామని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు చెప్పారు. ఒకవేళ అవసరమైతే ఎన్నికల తర్వాత కన్రడ్ సంగ్మా సారథ్యంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)తోనూ పొత్తు పెట్టుకునేందుకు కూడా సిద్ధమేనని సంకేతాలిచ్చారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడే మార్చి మూడో తేదీ వరకు వేచి చూడాల్సి ఉంటుందని ఆ నేత తెలిపారు.
రెండున్నరేళ్ల క్రితం ఎన్పీఎఫ్లో కాంగ్రెస్ సభ్యుల చేరిక
నాగాలాండ్లో అఖిలభారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పర్యవేక్షకుడు ప్రవీన్ దవార్ మాట్లాడుతూ నాగాలాండ్ రాష్ట్రంలో లౌకిక ప్రభుత్వ ఏర్పాటు కానున్నదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపారు. రద్దు కానున్న ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సభ్యుడు కూడా లేరు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రెండున్నరేళ్ల క్రితమే అధికార ఎన్పీఎఫ్లో చేరిపోయారు.
2003 నుంచి నాగాలాండ్లో అధికారానికి కాంగ్రెస్ పార్టీ దూరం
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలం రెండంకెల స్థాయికి చేరుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీ ప్రవీణ్ దవార్ తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజల్లో అంతర్గతంగా వ్యతిరేకత నెలకొని ఉన్నదన్నారు. 2003లో నాగాలాండ్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. నాటి నుంచి బీజేపీ, ఎన్పీఎఫ్ అధికారం పంచుకుంటున్నాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీలకు జరిగే ఎన్నికల ఫలితాలు వచ్చేనెల మూడో తేదీన వెలువడతాయి.
బీజేపీని నాశనం చేస్తాడని రియోపై జెలియాంగ్ మండిపాటు
నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) అధినేత నైప్యూ రియో ‘డర్టీ' రాజకీయాలు చేస్తున్నారని నాగాలాండ్ సీఎం టీఆర్ జెలియాంగ్ మండి పడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాగాలాండ్ రాష్ట్రంలో బీజేపీని పూర్తిగా నాశనం చేస్తానని ఆ పార్టీ నేత సోనియాగాంధీకి లేఖ రాశారని జేలియాంగ్ ఆదివారం ఒక బహిరంగ సభలో తెలిపారు. ఈ లేఖ ప్రధాని నరేంద్రమోదీ వద్ద ఉన్నదని ప్రకటించారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టాలన్న తపన నెరవేరకపోవడంతోనే నాగాలాండ్ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్లు తెలివిగా ఓటేయాలని కోరారు.