ఎన్నికల అఫిడవిట్లో తేడాలు మోడీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
ఢిల్లీ : ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించింది. ఈసీని మోసం చేసినందుకు మోడీపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే కాంగ్రెస్ ఆరోపణల్ని బీజేపీ కొట్టిపారేసింది.
తమిళనాడులో ఐటీ సోదాలు బయటపడ్డ కోట్ల కట్టలు
గాంధీ నగర్లో ప్లాట్
నరేంద్రమోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తప్పుడు వివరాలు సమర్పించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 2007 ఎన్నికల అఫిడవిట్లో మోడీ తనకు గాంధీ నగర్లోని సెక్టార్ వన్లో 411 వ నెంబర్ ప్లాటు తనదని పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఆ ప్లాటు వివరాలుచూపలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు.
అఫిడవిట్లో తేడాలు
2007లో గుజరాత్ గాంధీనగర్లో తన పేరిట ప్లాటు ఉందని చెప్పిన మోడీ.. 2012లో మాత్రం ఆ వివరాలు చూపలేదని కాంగ్రెస్ అంటోంది. 2012లో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో ఆయన మరో ప్లాటు వివరాలు మాత్రమే చూపారని చెబుతోంది. ఇలా రెండు అఫిడవిట్లలో తేడాలు ఉండటం ఆయన అవకతవకలకు పాల్పడిన విషయాన్ని రుజువు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై ఈసీ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
ఆరోపణల్ని ఖండించిన బీజేపీ
మోడీ అఫిడవిట్లపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్ని బీజేపీ ఖండించింది. కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. తప్పుడు ఆరోపణల పర్వం కొనసాగించడం ఆ పార్టీ వైఖరిగా మారిందని ట్వీట్ చేసింది. గతంలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపైనా ఇలాంటి ఆరోణలు చేసిన విషయాన్ని గుర్తు చేసింది.