అసెంబ్లీకి రండి.. లేదంటే అనర్హత వేటు తప్పదు... రెబల్ ఎమ్మెల్యేలకు డీకే వార్నింగ్
బెంగళూరు : కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ జేడీఎస్ శతవిధలా ప్రయత్నిస్తోంది. అసెంబ్లీలో బలం లేదని .. బలం నిరూపించుకోవాలని విపక్ష బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ దాటవేస్తోంది. సోమవారం బలపరీక్ష నిర్వహిస్తామని తొలుత ప్రకటించినా .. తర్వాత నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడుతూ వస్తోంది. చివరికి స్పీకర్ కలుగజేసుకొని రాత్రి 9 గంటలకు నిర్వహిస్తామని చెప్పినా .. అధికార పార్టీ అలుకు బెలుకు లేదు. దీంతో కాంగ్రెస్ మరో అస్త్రాన్ని తెరపైకి తీసుకొచ్చింది.
రెబల్ ఎమ్మెల్యేలకు మంగళవారం ఉదయం 11 గంటల వరకు సమయం ఉందని గుర్తుచేశారు మంత్రి డీకే శివకుమార్. కానీ వారిని బీజేపీ మభ్యపెట్టేందుకు ప్రయత్నించి .. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరుచాలని చూస్తుందని ఆరోపించారు. మరికొన్ని గంటల్లో వారు రాజీనామా వెనక్కి తీసుకోకుంటే అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. ఒక్కసారి అనర్హత వేటు పడ్డాక సభలోకి వచ్చేందుకు అర్హులు కాదని పేర్కొన్నారు. కానీ వారిని బీజేపీ మాత్రం మంత్రులు చేస్తామని మాయమాటలు చెప్తుందని ఆరోపించారు. అదేలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
ఉదయమే కాదు రాత్రి కూడా సభ వాయిదా పడుతూ వస్తోంది. బల నిరూపణ జరుపాలని బీజేపీ, వద్దని అధికార పార్టీ నినాదాలతో సభ దద్దరిల్లిపోయింది. రాత్రి 10.45 గంటలకు కూడా సభ వాయిదా పడటంతో .. కొందరు షుగర్ పేషెంట్లు ఉన్నారని ఆహారం అందించాలని కోరారు. మీకు కూడా షుగర్ ఉంది కదా .. రేపు ఉదయం 10 గంటలకు సమావేశం అవుదామని అధికార పార్టీ నేతలు యడ్యూరప్పను కోరారు. మరోవైపు స్పీకర్ కూడా ఇంటికెళ్లిపోగా .. డిప్యూటీ స్పీకర్ సభను నిర్వహిస్తున్నారు.