దొంగతనం చేయడంలో వారికి వారే సాటి: రాహుల్కు నిర్మలా కౌంటర్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్లు బదిలీ చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ నుంచి ప్రభుత్వం పెద్దమొత్తంలో డబ్బులు దొంగలించిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. దొంగతనం అనేది కాంగ్రెస్ వారికి అలవాటు అయిపోయిందంటూ రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. దొంగతనంలో కాంగ్రెస్ ఆరితేరిపోయిందంటూ నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ చోర్ (దొంగ) అనే పదం వాడారని అయితే తను ఆ పదప్రయోగం చేయనని చెబుతూనే... కాంగ్రెస్ దొంగ అనే పదంను ఆపాదించుకున్నారని ఈ పదం ప్రయోగించడంలో వారు ఎక్స్పర్ట్లని నిర్మలా సీతారామన్ అన్నారు. కొన్ని దశాబ్దాలుగా దేశ ఆర్థిక రంగంలో కీలకంగా వ్యవహరిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కాంగ్రెస్ సన్మానించిన తీరు చాలా బాధాకరమని నిర్మలా సీతారామన్ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ సూచించినట్లుగానే కేంద్రానికి నగదు బదిలీ చేయడం జరిగిందని గుర్తుచేసిన నిర్మలా సీతారామన్ అలాంటి మంచి రిప్యూటేషన్ కలిగి ఉన్న సంస్థను కాంగ్రెస్ చులకన చేసి మాట్లాడటం సరికాదన్నారు.
ఇదిలా ఉంటే మంగళవారం రోజున కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వయంకృతాపరాధంతో ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్లకు ఈ సమస్యను గట్టెక్కించడం ఎలానో తెలియలేదని విమర్శించారు. అందుకే రిజర్వ్ బ్యాంకు నుంచి డబ్బులు దొంగతనం చేశారనే వివాదాస్పద వ్యాఖ్యలు రాహుల్ గాంధీ చేశారు. ఓ క్లినిక్ నుంచి బ్యాండ్ ఎయిడ్ దొంగలించి తుపాకీ గాయాలపై అతికించినట్లుగా ఉందంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తమ దగ్గర ఉన్న నిల్వల నుంచి రూ. 1.76 లక్షల కోట్లు ప్రభుత్వంకు ఆర్బీఐ బదిలీ చేస్తున్నట్లు ప్రకటించిన క్రమంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.