షాకింగ్ న్యూస్: ‘కేంబ్రిడ్జ్ అనలిటికాకు కాంగ్రెస్ క్లైంటే’
లండన్: కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. కోట్లాది మంది వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయిందంటూ సంచలన విషయాన్ని బయట పెట్టిన విజిల్ బ్లోయర్ క్రిస్టోఫర్ వైలీ కాంగ్రెస్ పార్టీపై మరో బాంబు పేల్చారు.
కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకు భారత్లోని కాంగ్రెస్ క్లయింట్గా ఉందని స్పష్టం చేశారు. ఆయన బ్రిటన్ పార్లమెంటు వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ క్లైంటే.. కానీ,
‘కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ సేవలను కాంగ్రెస్ వినియోగించుకుంది. అయితే.. అది ప్రాంతీయంగానా లేదా జాతీయంగానే అనే దానిపై మాత్రం స్పష్టత లేదు. ఎందుకంటే భారత్ చాలా పెద్ద దేశం. ఆ దేశంలోని ఒక్కో రాష్ట్రం బ్రిటన్ అంత పెద్దదిగా ఉంటుంది' అని ఆయన మీడియా ద్వారా వెల్లడించారు.
అసలేంటీ ‘కేంబ్రిడ్జ్ అనలిటికా'? ఏం చేసింది?: డేటా చౌర్యం, ఎఫ్బీ సారీ
రాహుల్ క్షమాపణ చెప్పాలి..
కాగా, దీనిపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెంటనే స్పందించారు. ‘కేంబ్రిడ్జ్ అనలిటికా బండారాన్ని బయటపెట్టిన క్రిస్టోఫర్ చెప్పారు.. కాంగ్రెస్కు ఆ సంస్థతో సంబంధాలు ఉన్నాయని ధ్రువీకరించారు. ఇప్పుడు కాంగ్రెస్, రాహుల్గాంధీ తప్పకుండా క్షమాపణ చెప్పాలి' అని రవిశంకర్ డిమాండ్ చేశారు.
కేంబ్రిడ్జ్ సంచలనం
కేంబ్రిడ్జ్ అనలిటికా సేవలను ఉపయోగించుకున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి. ఈ సంస్థతో కాంగ్రెస్కు సంబంధాలు ఉన్నాయని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ గతంలోనే ఆరోపించారు. ఆ ఆరోపణలను కాంగ్రెస్ తిప్పికొడుతూ బీజేపీనే కేంబ్రిడ్జ్ అనలిటికా సేవలను ఉపయోగించుకుందని ధ్వజమెత్తింది. అయితే, తాజాగా, కేంబ్రిడ్జ్ అనలిటికాకు కాంగ్రెస్ క్లైంటేనన్న వార్తలు సంచలనంగా మారాయి.
భారత్ లోనూ కలకలం
ఐదు కోట్ల మంది ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారాన్ని అమెరికా సహా పలు దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు బ్రిటన్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా ఉపయోగించుకుందని ఆరోపణలు యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రకంపనలు భారత్లోనూ కలకలం రేపాయి.