సోనియా నాయకత్వంపై ప్రణబ్ వ్యాఖ్యలు-అంగీకరిస్తున్న సీనియర్లు - పైకి మాత్రం
కాంగ్రెస్ పార్టీ నానాటికీ పతనం కావడానికి సోనియాగాంధీ నాయకత్వ లేమే కారణమంటూ మాజీ రాష్ట్రపతి, ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ తన స్వీయ చరిత్రలో రాశారు. అయితే ప్రస్తుతం అదే కారణంతో పార్టీ అధినాయకత్వాన్ని చికాకు పెడుతున్న సీనియర్లకు ప్రణబ్ వ్యాఖ్యలు కొండంత బలానిచ్చాయి. తాము లేవెనత్తిన అంశాన్నే ప్రణబ్ కూడా తన ఆత్మకథలో ప్రస్తావించారని, అప్పుడు తమపై విమర్శలు చేసిన వాళ్లు ఇప్పుడేమంటారని వారు ప్రశ్నిస్తున్నారు. స్ధూలంగా సోనియా గాంధీ నాయకత్వ మార్పు ద్వారానే కాంగ్రెస్ పార్టీ సంక్షోభం నుంచి బయటపడి పునర్ వైభవం సాధించగలదని వారు నమ్ముతున్నారు.
సోనియా గాంధీ నాయకత్వ లేమి...
రాజీవ్ గాంధీ తర్వాత గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇతర సీనియర్ల చేతుల్లోకి వెళ్లిన పార్టీకి తిరిగి ప్రాణం పోసిన సోనియాగాంధీ... యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాల కాలంలో అత్యంత బలమైన నేతగా పేరు తెచ్చుకున్నారు. ఆ పదేళ్లలో తెరవెనుక ఉంటూనే యూపీఏ ప్రభుత్వాలను శాసించిన సోనియాగాంధీ... పార్టీలో సీనియర్లను కూడా కోటరీగా మార్చుకున్నారు.
కానీ పరిస్ధితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా..కాంగ్రెస్ ఘోరపరాజయంతో సోనియా లెక్కలు కూడా తారుమారయ్యాయి. ఒకప్పుడు ఆమెను దేవతగా పొగిడిన వారంతా ఆ తర్వాత క్రమంగా కత్తులు దూయడం ప్రారంభించారు. చివరికి పార్టీలో ఎన్నికలు పెడతారా, మా దారి మమ్మల్ని చూసుకోమంటారా అంటూ ఏకంగా 23 మంది సీనియర్లు అధినేత్రి సోనియాకు లేఖ రాశారు.
ప్రణబ్ స్వీయచరిత్రలో వ్యాఖ్యల కలకలం...
మాజీ రాష్ట్రపతి, ఒకప్పటి కాంగ్రెస్ నేత "ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్" పేరుతో రాసుకున్న స్వీయ చరిత్రను ఆ తర్వాత రూపా పబ్లిషర్స్ త్వరలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో ప్రణబ్ చేసిన వ్యాఖ్యలను తాజాగా లీక్ చేశారు. ఇందులో ఆయన సోనియగాంధీ నాయకత్వ లేమి వల్లే కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత తిరిగి కోలుకోలోని పరిస్ధితిలోకి దిగజారిందని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఇప్పుడు ప్రణబ్ వ్యాఖ్యలే కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ఆయుధాలుగా మారాయి. ఇప్పటికే సోనియా నాయకత్వాన్ని ధిక్కరిస్తున్న వీరంతా ఇప్పుడు సంస్ధాగత ఎన్నికలు నిర్వహించాలంటూ పార్టీపై ఒత్తిడి పెంచుతున్నారు.
ప్రణబ్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్న సీనియర్లు..
తన ఆత్మకథలో ప్రణబ్ ముఖర్జీ.. అధినేత్రి సోనియాగాంధీపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్లు అంగీకరిస్తున్నారు. వీరిలో చాలా మంది గతంలో సోనియాకు లేఖ రాసిన వారే ఉన్నారు. వీరంతా ఇప్పుడు ప్రణబ్ వ్యాఖ్యలను హైలెట్ చేయడం ద్వారా పార్టీపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో జనవరిలో ప్రణబ్ ఆత్మకథ రిలీజ్ సంచలనాలు రేపే అవకాశం కనిపిస్తోంది. ఈ స్వీయ చరిత్రలో ప్రణబ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలోనూ కలకలం రేపే అవకాశం ఉండటంతో ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ పబ్లిషర్స్ పై మండిపడుతున్నారు. అయితే ఆయన పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని రూపా పబ్లిషర్స్ చెబుతోంది. దీంతో ప్రణబ్ ఆత్మకథ విడుదల ఉత్కంఠ రేపుతోంది.
Recommended Video
నోరు మెదపని సీనియర్లు...
ప్రణబ్ ఆత్మకథలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియగాంధీ నాయకత్వ లేమిపై ప్రణబ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పార్టీలో సోనియా నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్లు ఈ ఆత్మకథలోని అంశాలతో ఏకీభవిస్తున్నా.. బయటికి మాట్లాడేందుకు మాత్రం సిద్ధం కావడం లేదు. అంతర్గతంగానే ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. దీంతో ఈ అంశం కూడా సోనియాకు చికాకు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రణబ్ ఆత్మకథ విడుదల తర్వాత కూడా పార్టీ సీనియర్లు దీనిపై బహిరంగంగా మాట్లాడకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో సంస్ధాగత ఎన్నికల నిర్వహణకు మాత్రం ప్రణబ్ స్వీయచరిత్ర దోహదం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.