జయంతి ఇష్యూ: చిద్దూ, కుమారుడిపైనా పడిన తమిళ చీఫ్
చెన్నై: జయంతి నటరాజన్ రాజీనామాను బేఖాతరు చేస్తూ తమిళనాడు కాంగ్రెసు కమిటీ చీఫ్ వికెఎస్ ఎలంగోవన్ మాజీ కేంద్ర మంత్రి చిదంబరంపైనా, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపైనా విరుచుకపడ్డారు. మరో ఇద్దరు వ్యక్తులు కూడా వెళ్లిపోతే కాంగ్రెసు బలం పుంజుకునేదని వారిద్దరినీ ప్రస్తావిస్తూ ఆయన అన్నారు. వారిద్దరు కూడా వెళ్లికపోతే తమ పార్టీ ప్రక్షాళన జరుగుతుందని ఆయన అన్నారు.
"మీరు రాజీనామా చేశారు. మీతో పాటు మరో వ్యక్తిని, ఆయన కుటుంబాన్ని కూడా రాజీనామా చేస్తే పార్టీ ప్రక్షాళన జరుగుతుంది. అది పార్టీ బలం పుంజుకోవడానికి ఉపయోగపడతుంది" అని ఆయన శుక్రవారం అన్నారు. యుపిఎ ప్రభుత్వంలో పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన చిదంబరం 2014 ఎన్నికల్లో పోటీ చేయడానికి వెనకాడారని ఆయన అన్నారు. దాని వల్ల పార్టీ కార్యకర్తలు ఎంతగా నిస్పృహకు గురయ్యారో మాటల్లో చెప్పలేమని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీకి తమ కుటుంబ ఎంతో సేవ చేసిందని జయంతీ నటరాజన్ అన్న మాటలను గుర్తు చేస్తూ రాష్ట్రంలో ఆమె తాత ఎం భక్తవత్సలం పాలన గురించి చెప్పారు. ముఖ్యమంత్రిగా హిందీ వ్యతిరేక ఆందోళనకారులను చంపడానికి కారణం భక్తవత్సలమేనని ఆయన అన్నారు. సరైన సమయంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం సరఫరా చేయలేదని విమర్శించారు. కామరాజ్ స్వర్ణ పాలన 1967లో ముగిసిన తర్వాత భక్తవత్సలం పాలన ప్రారంభమైందని ఆయన గుర్తు చేశారు.
జయంతీ నటరాజన్ వెళ్లిపోవడంతో పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీపై జయంతీ నటరాజన్ చేసిన విమర్శలకు ఇది సమయమేనా అని ఆయన అడిగారు. 2013లో ఆమె మంత్రి పదవి నుంచి తప్పుకున్నారని, పార్టీ నాయకత్వంపై 13 నెలలు ఎందుకు మాట్లాడలేదని, ఇంతకాలం నిరీక్షించడానికి కారణం ఏమిటని ఆయన అన్నారు. జయంతీ నటరాజన్ 27 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారని, ఇది గిన్నీస్ రికార్డు అని ఆయన వ్యంగ్యంగా అన్నారు.