సర్జికల్స్ స్ట్రైక్స్ మేము కూడా చేస్తాం అంటున్న రాహుల్గాంధీ : ఎక్కడ ? ఎప్పుడు ? ఎందుకు ?
రాజస్తాన్ : పేదరికంపై కనీస ఆదాయ పథకం ద్వారా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. రాజస్తాన్లో పర్యటించిన రాహుల్ గాంధీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు రూ. 12వేలు ఇస్తుందని చెప్పారు. 21వ శతాబ్దంలో కనీస ఆదాయ రేఖను భారత్ గీస్తుందని దీనికి దిగువన ఏ ఒక్కరూ ఉండేందుకు వీలు లేదని రాహుల్ గాంధీ అన్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకే ఈ పథకం తీసుకొచ్చినట్లు రాహుల్ గాంధీ సభకు తెలిపారు.
శారదా చిట్ ఫండ్ కుంభకోణం: సీబీఐ రిపోర్టులో చాలా తీవ్రమైన అంశాలున్నాయన్న సుప్రీం
ధనవంతులకు మోడీ...పేదలకు కాంగ్రెస్
నరేంద్ర మోడీ ప్రభుత్వం ధనవంతులకు డబ్బులు సమకూరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు డబ్బులను సమకూరుస్తుందని అన్నారు. దేశంలో 20శాతం కఠిక పేదరికంలో జీవిస్తున్న కుటుంబాలను గుర్తించి వారికి ఏడాదికి రూ.72వేలు ఇస్తామని రాహుల్ చెప్పారు. మోడీ సర్కార్ పేదల పక్షపాతి కాదని ఆరోపించిన రాహుల్ గాంధీ.... పేద కుటుంబాలను ధ్వంసం చేయాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ పేదరికాన్ని పారద్రోలేందుకు ప్రయత్నాలు చేస్తోందని అన్నారు.
అనిల్ అంబీనీ నీరవ్ మోడీలకు మాత్రమే చౌకీదార్
ఇక ప్రధాని నరేంద్ర మోడీ తాను దేశం మొత్తానికి వాచ్మెన్గా ఉంటానని ముందుగా దేశ ప్రజలకు చెప్పలేదని ...ఇప్పుడు పారిశ్రామికవేత్తలైన అనిల్ అంబానీ, నీరవ్ మోడీలకు మాత్రమే కాపలాదారుడిగా ఉన్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. బీజేపీ విస్తృతంగా ప్రచారం చేస్తున్న మై భీ చౌకీదార్ నినాదంను ఉద్దేశించి రాహుల్ గాంధీ వ్యాఖ్యాలు చేశారు. తాను వాచ్మెన్ అని ప్రధాని చెప్పుకుంటున్నాడని అయితే ఎవరికి కాపలాదారుడో అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేకున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. రైతు ఇంటి వద్ద చౌకీదార్ను చూశారా... నిరుద్యోగ యువత ఇంటిముందు చౌకీదార్ను చూశారా అని రాహుల్ ప్రశ్నించారు.
మోడీ దేశంలో ధనవంతులకే చోటు
గత ఐదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ భారత దేశాన్ని రెండుగా విభజించారని చెప్పిన రాహుల్... ఒకటి ధనికు దేశంగా మరొకటి పేదల దేశంగా విభజించారని చెప్పారు. నరేంద్ర మోడీ దృష్టిలో ఉన్న భారత్లో కేవలం ధనికులకు మాత్రమే చోటు ఉంటుందని అన్నారు రాహుల్ గాంధీ. ఈ సారి ఎన్నికల్లో రెండు సిద్ధాంతాల మధ్య పోరు జరుగనుందని చెప్పిన కాంగ్రెకస్ అధ్యక్షుడు... ఒకటి బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అని వెల్లడించారు. ఇది విద్వేషాలను రెచ్చగొట్టే సిద్ధాంతం అని చెప్పారు. ఇక కాంగ్రెస్ సిద్ధాంతం సోదరభావం పెంపొందించడం, ప్రేమ ఆప్యాయలతో మెలగడాన్ని ప్రమోట్ చేస్తుందని వివరించారు.
పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడు మాత్రమే ఇబ్బంది పడ్డాడు
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ ఉపాధి పథకం, ఆహార భద్రత పథకాలను బీజేపీ సర్కారు బలహీనపరుస్తోందని ధ్వజమెత్తారు. వీటన్నిటినీ మోడీ సర్కార్ అణిచివేసిందని ఫలితంగా దేశంలో పేదరికం, యువతకు ఉద్యోగాలు కరువయ్యాయని చెప్పారు. ఇక ప్రజల డబ్బులను లూటీ చేసి కొందరు దేశాన్ని దాటారంటే ఇందుకు ఎన్డీఏ ప్రభుత్వం సహకరించిందని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ పై మాట్లాడిన రాహుల్ గాంధీ... పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడు మాత్రమే ఇబ్బంది పడ్డారని బడా బాబులు కాదని గుర్తు చేశారు. నల్లడబ్బును అణిచివేసేందుకే పెద్ద నోట్ల రద్దు చేశామని చెబుతున్న మోడీ... నల్లడబ్బులు ఉన్న బడాబాబులు ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు.