ఎన్నికలు పెట్టకపోతే వచ్చే 50 ఏళ్లు కాంగ్రెస్ విపక్షంలోనే- ఆజాద్ మరో సంచలనం..
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న నాయకత్వ సంక్షోభానికి కారణంగా భావిస్తున్న సోనియాగాంధీకి లేఖ వ్యవహారంలో కీలకంగా ఉన్న పార్టీ సీనియిర్ నేత గులాం నబీ ఆజాద్ ఇవాళ మరో సంచలనానికి తెరలేపారు. పార్టీ సంస్ధాగత ఎన్నికలకు సంబంధించి ఏఎన్ఐ వార్తాసంస్ధతో మాట్లాడిన ఆజాద్ పార్టీకి సంస్ధాగత ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ చేసిన హెచ్చరికలు తీవ్ర కలకలం రేపేలా ఉన్నాయి.
ఏ పార్టీకైనా ఎన్నికైన వ్యవస్ధ నాయకత్వం అవసరమని, ఎన్నికలు నిర్వహించకుండా ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేదని ఆజాద్ వ్యాఖ్యానించారు. ఇదే కోవలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలు నిర్వహించకపోతే వచ్చే 50 ఏళ్లు విపక్షంలోనే కూర్చోవాల్సి వస్తుందని ఆజాద్ హెచ్చరికలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి 51 శాతం మంది తన వెంట ఉండాలని, మిగతా వారికి 10, 15 శాతం మద్దతు ఎలాగో ఉంటుందని, కానీ కాంగ్రెస్ పార్టీకి నామినేటెడ్ అధ్యక్షుడికి పార్టీలో ఒకశాతం మద్దతు కూడా ఉన్నట్లు కనిపించడం లేదంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆజాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో రెండు, మూడు స్ధానాల్లో కనీస మద్దతు ఉన్న వ్యక్తులు తిరిగి మద్దతు సంపాదించేందుకు కష్టపడాలన్నారు.
అలాగే ఎన్నికైన సీడబ్ల్యూసీ సభ్యులను తొలగించే అధికారం కూడా ఎవరికీ లేదన్నారు. పార్టీలో నామినేట్ అయిన వ్యక్తిని తొలగించవచ్చు కానీ ఎన్నికైన వ్యక్తిని తొలగించేందుకు వీలు కాదని ఆజాద్ వ్యాఖ్యానించారు.సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియాగాంధీని మరికొంతకాలం పాటు తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాలని సభ్యులు కోరిన ఐదు రోజుల తర్వాత అసలు ఈ సంక్షోభానికి ప్రధాన కారకుల్లో ఒకరుగా భావిస్తున్న ఆజాద్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి.
కాంగ్రెస్లో గాంధీ కుటుంబ విధేయులుగా చెప్పుకుంటూ ఎన్నికలను వ్యతిరేకిస్తున్న వారిపైనా ఆజాద్ మండిపడ్డారు. వారు ఎన్నికలను వ్యతిరేకించడం ద్వారా పార్టీకి, జాతికి కూడా నష్టం చేస్తున్నారని ఆజాద్ వ్యాఖ్యానించారు.