నిన్న శాస్త్రి, నేడు సింగ్.. కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు ప్రియాంక చేపట్టాలని డిమాండ్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవీ ఎవరూ చేపట్టాలనే అంశంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులు ఎవరూ చీఫ్ పదవీ చేపట్టబోరని ఇదివరకే రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. కానీ ఆ పార్టీ నేతలు మాత్రం గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులే పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతున్నారు. లేదంటే పార్టీ చీలిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రాహుల్ పగ్గాలు స్వీకరించేందుకు ససేమిరా అనడంతో ఆయన చెల్లి, ప్రియాంక గాంధీని అధ్యక్షురాలిగా చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
తురుపు ముక్క
రాహుల్ చెల్లి ప్రియాంక గాంధీని అధ్యక్షురాలిగా చేయాలనే డిమాండ్ ఎక్కువవుతోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్ కూడా ప్రియాంక అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియాంక .. అధ్యక్ష పదవీ చేపట్టే నేతల్లో ముందువరుసలో ఉన్నారని పేర్కొన్నారు. దీనికి ఇటీవల సోన్భద్రలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఘటనను గుర్తుచేశారు. అంతేకాదు ఒకవేళ గాంధీ కుటుంబసభ్యులు కాకుండా మిగతా వారు అధ్యక్ష పదవీ చేపడితే పార్టీ రెండుగా విడిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే కొందరు నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా నట్వర్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అనిల్ కూడా ..
మాజీ ప్రధాని దివంగత లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవీ ప్రియాంక చేపట్టాలని కోరారు. అంతేకాదు ప్రియాంక తప్పితే మరో అవకాశమే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు ప్రియాంక అభ్యర్థిత్వాన్ని వంద శాతం ఆమోదిస్తారని గుర్తుచేశారు. అంతేకాదు మిగత నేతలు కాంగ్రెస్ అధ్యక్ష పదవీ చేపడితే పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. దీనిని నట్వర్ సింగ్ కూడా ప్రస్తావించారు. గాంధీ కుటుంబం నుంచి కాకుండా మరే నేత కాంగ్రెస్ చీఫ్ పదవీ చేపడితే 24 గంటల్లో పార్టీ చీలిపోతుందని బెదిరించారు. 134 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబమే దిక్కని, మరే నేత ఇక్కడ ఉన్నత పదవీ చేపట్టబోరని కూడా వ్యాఖ్యానించారు.
దూరం దూరంగా ..
లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవీకి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ముఖ్య నేతలు చెప్పినా వినిపించుకోలేదు. రాజీనామాకు కట్టుబడి ఉన్నానని చెప్పడంతో రాహుల్ .. వారసుడిని వెతికే పనిలో నిమగ్నమైంది కాంగ్రెస్ హైకమాండ్. అయితే అధ్యక్ష పదవీని గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులే చేపట్టాలని నేతలు, మాకు పదవులు వద్దని రాహుల్ చెప్పడంతో .. కాంగ్రెస్ చీఫ్ పోస్ట్ గత కొద్దిరోజులుగా ఖాళీగా ఉంది. ఇదే అదనుగా భావించిన అధికార పార్టీ .. మిగతా రాష్ట్రాల్లో తమ పార్టీని మరింత బలోపేతం చేసుకుంటుంది. కర్ణాటకలో ఎమ్మెల్యేల రాజీనామా, గోవాలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక .. పరిణామాలు కాంగ్రెస్ పార్టీని గుక్కతిప్పుకోకుండా చేస్తున్నాయి.