అద్వానీకి విలువలేదు, ఆ కళ్లలో మోడీ పట్ల ఆగ్రహం, అందరూ ఆరెస్సెస్సే: రాహుల్
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వానిది చేతల ప్రభుత్వం కాదని, కేవలం మాటల ప్రభుత్వమేనని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదివారం అన్నారు. ప్రజల కళ్లలో తాను మోడీ పట్ల ఆగ్రహాన్ని చూస్తున్నానని చెప్పారు. ప్రధాని మాట్లాడుతుంటే ప్రజలు నిజాలు వెతుక్కుంటున్నారని చెప్పారు.
జన్ ఆక్రోష్ ర్యాలీ: ప్రధానిపై నిప్పులు చెరిగిన సోనియా, మన్మోహన్ సింగ్
రామ్ లీలా మైదాన్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్ ఆక్రోష్ సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ జన్ ఆక్రోష్ నిర్వహించారు. ప్రధాని మోడీ అవినీతిపరులను పక్కన పెట్టుకొని అవినీతిపరుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
అవినీతిని అంతం చేస్తానని మోడీ చెప్పినవి అన్నీ అబద్దాలే అన్నారు. యెడ్యూరప్పను పక్కన పెట్టుకొని నీతిసూత్రాలు చెబుతున్నారన్నారు. దేశ ప్రజల డబ్బు నేరుగా నీరవ్ మోడీ వంటి వారి జేబుల్లోకి వెళ్లిందన్నారు. జనం కష్టాన్ని నీరవ్ దోచేస్తే మోడీ చూస్తూ కూర్చుండిపోయారన్నారు. ఇప్పటి వరకు ఈ అంశంపై మోడీ మాట్లాడలేదన్నారు.
న్యాయవ్యవస్థలోని సంక్షోభంపై మోడీ మౌనానికి అర్థం ఏమిటని ప్రశ్నించారు. న్యాయం కోసం న్యాయమూర్తులే పోరాడాల్సిన పరిస్థితి అన్నారు. వెళ్లిన ప్రతిచోట మోడీ తప్పుడు హామీలు ఇస్తున్నారన్నారు. ప్రధాని మోడీ అబద్దాలు చెబుతూనే చెప్పలేదని వ్యాఖ్యానిస్తున్నారని విమర్శించారు. నేరస్తులకు టిక్కెట్లు ఇచ్చిన చరిత్ర మోడీది అన్నారు.
కాంగ్రెస్ హయాంలో హెచ్ఏఎల్ విమానాలను రూ.700 కోట్లతో కొనుగోలు చేశామని, ఇప్పటి ప్రభుత్వం రూ.1500 కోట్లకు కొనుగోలు చేస్తోందన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ చిరు వ్యాపారులను నిండా ముంచాయన్నారు. దేశంలోని అన్ని వ్యవస్థల్లోను ఆరెస్సెస్ వ్యక్తులనే నియమిస్తున్నారని ఆరోపించారు. కేంద్రమంత్రుల ఓఎస్డీలు అందరూ ఆరెస్సెస్ వ్యక్తులే అన్నారు.
నోట్ల రద్దు, గబ్బర్ సింగ్ ట్యాక్స్ ద్వారా ప్రజల నడ్డి విరిచారన్నారు. రైతుల కోసం మాత్రం ప్రధాని ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేదన్నారు. రైతులు చెమటోడ్చి దేశ ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నారన్నారు. పంటలకు మద్దతు ధర కల్పించరని, రుణమాఫీ ఉండదన్నారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. బీజేపీ నేతలే మహిళలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారన్నారు.
మోడీ పాలనలో ఎటు చూసినా అవినీతే కనిపిస్తోందన్నారు. అమిత్ షా కుమారుడి అవినీతి మోడీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 60 నెల్లో మోడీ ఇచ్చింది అవినీతి, కుంభకోణాలు, నిరుద్యోగం అన్నారు. దేశానికి ఇప్పుడు కావాల్సింది ప్రేమ తప్ప.. విద్వేషం కాదన్నారు.
2019లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పారు. బీజేపీ, ఆరెస్సెస్ కలిసి దేశంలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కర్నాటక, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. బీజేపీ అంటే మోడీ, అమిత్ షాలే అన్నారు. అద్వానీ వంటి సీనియర్లకు పార్టీలో విలువ లేదన్నారు.