వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు గెలుస్తుంది: సోనియా ధీమా
న్యూఢిల్లీ: కొద్ది నెలల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ గెలిచి తీరుతుందని యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఎఐసిసి ప్లీనరీలో ఆమె శనివారంనాడు ప్రసంగించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే కాంగ్రెసు పాలన సాగిందని చెప్పారు.
కాంగ్రెసు అస్తిత్వంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నవాళ్లకు తగిన సమాధానం చెప్తామని అన్నారు. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా భావసారూప్యం గల పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు.
కాంగ్రెసు ఓ రాజకీయ అంశం కాదు, ఉద్యమమని అన్నారు. కాంగ్రెసు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. మీరే నా శక్తి అని అన్నారు. భారతీయ సంస్కృతిలో కాంగ్రెసు ఓ భాగమని అన్నారు.
దేశ రాజకీయాల్లో కాంగ్రెసు మరోసారి క్రియాశీలం కావాలని అన్నారు. త్వరలో జరగబోయే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెసు విజయం సాధిస్తుందని చెప్పారు. పరిస్థితుల ప్రభావంతో తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని చెప్పారు.
అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తుందని, పోరాటం చేస్తుందని సోనియా అన్నారు. మోడీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని, కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెసుకు పూర్వ వైభవం వస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.
కాంగ్రెసు ప్రారంభించిన సంక్షేమ పథకాలను నీరు గార్చే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది కాంగ్రెసు మాత్రమేనని అన్నారు. కాంగ్రెసు విజయాన్ని ప్రతి ఒక్కరి విజయంగా భావించాలని అన్నారు. సోనియా గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో మధ్య మధ్య పెద్ద యెత్తున హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.