132 స్థానాల్లో మాదే గెలుపు: దిగ్విజయ్ సింగ్, వారిద్దరిలో ఒకరు ముఖ్యమంత్రి
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం ముగిసింది. గెలుపుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. 230 అసెంబ్లీ స్థానాలకు గాను తమకు 132 సీట్లకు పైగా వస్తాయని చెప్పారు.
2013 అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఇప్పుడు రెండు శాతం ఎక్కువగా పోలింగ్ నమోదయింది. ఈ ఎన్నికల్లో 75 శాతం రికార్డ్ పోలింగ్ నమోదయింది. తాము 132 కంటే అధిక స్థానాల్లో గెలుపొందుతామని, పదిహేనేళ్లుగా రాష్ట్రంలో ఉన్న బీజేపీని గద్దె దింపనున్నామని, 2013 శాసనసభ ఎన్నికలు జరిగిన సమయంలో మూడు శాతం మంది బోగస్ ఓటర్లే ఉన్నారని, ఈ సారి అలా జరగకుండా ఓటర్లు జాబితాపై దృష్టి పెట్టి, ఈసీ దృష్టికి తీసుకెళ్ళామని ఆయన చెప్పారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడానికి కాంగ్రెస్ కార్యకర్తలు శాయశక్తులా పని చేశారని చెప్పారు. పార్టీ విజయం కోసం అన్ని విధాలుగా కృషి చేశారని ప్రశంసించారు. ఈ ఎన్నికలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జరిగిన పోరాటం వంటివి అన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం తాము నిత్యం కృషి చేశామని, డిసెంబరు 11న వెల్లడయ్యే ఫలితాల్లో తమ పార్టీయే అత్యధిక స్థానాల్లో గెలుపొందుతుందని, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని ఆ ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కమల్నాథ్, జ్యోతిరాధిత్య సింధియా చెప్పారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గెలిస్తే వీరిలో ఒకరు సీఎం అవుతారనే ప్రచారం సాగుతోంది.
మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాంలలో ఎన్నికలు ముగిశాయి. తెలంగాణ, రాజస్థాన్లలో మరో ఎనిమిది రోజుల్లో పూర్తి కానున్నాయి. ఆ తర్వాత డిసెంబరు 11న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.