బీజేపీకి కాంగ్రెస్ దెబ్బకు దెబ్బ: ఉపఎన్నిక గెలుపుతో సీన్ రివర్స్, మేఘాలయలో కర్ణాటక రిపీట్?
న్యూఢిల్లీ: మేఘాలయలోని అంపతి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్థి మియాని డి షీరా విజయం సాధించారు. 3,191 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ విజయం సాధించింది. తాజా విజయంతో మేఘాలయలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
Recommended Video
ఇప్పుడు కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా
ఇప్పుడు కాంగ్రెస్ అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించడంతో మేఘాలయలో కర్ణాటక రాజకీయాలు పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ అధికారానికి చెక్ పెట్టే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కాంగ్రెస్ గవర్నర్ను కోరనుంది.
మేఘాలయలో ఇదీ బలం
మేఘాలయలో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 స్థానాలు, కాంగ్రెస్ వైరి పక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ 19 స్థానాల్లో గెలిచింది.
అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ముకుల్ సంగ్మా రెండు స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన అంపతి నియోజకవర్గానికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్కు 20 స్థానాలు ఉన్నాయి.
ఎన్పీపీ మరో సీటు గెలుచుకోవడంతో కాంగ్రెస్తో సమానంగా
ఆ తర్వాత ఎన్పీపీ ఆధ్వర్యంలో విలియమ్ నగర్ గెలుపొందారు. దీంతో కాంగ్రెస్, ఎన్పీపీ.. ఇరుపార్టీల స్థానాలు చెరో ఇరవైగా ఉన్నాయి. బీజేపీ, ఇతర స్వతంత్రులతో ఎన్పీపీ అధికారం దక్కించుకుంది.
ఎన్పీపీ 20, యూడీపీ 6, పీడీఎఫ్ 4, బీజేపీ 2, హెచ్ఎస్పీడీపీ 2, ఇండిపెండెంట్ 2, ఎన్సీపీ 1 స్థానాలతో అధికారంలో ఉన్నాయి. ప్రతిపక్షంలో కాంగ్రెస్ 21, కేహెచ్ఎన్ఏఎం 1, స్వతంత్రులు 1 ఉన్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, గవర్నర్ వద్దకు?
ఇప్పటి వరకు కాంగ్రెస్, ఎన్పీపీ చెరో 20 స్థానాలతో సమానంగా ఉన్నారు. ఇప్పుడు అంపతి గెలుపుతో కాంగ్రెస్ ఒక స్థానంలో ముందంజలో ఉండి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది. దీంతో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కాంగ్రెస్ కోరే అవకాశముంది. ప్రస్తుతం లెక్క ప్రకారం కాంగ్రెస్కు బలం లేదు. అయితే, స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీలు ఏం చేస్తాయనేది ఆసక్తికరం. ఇటీవల కర్ణాటకలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలనే డిమాండ్ వచ్చినప్పటి నుంచి ఇది చర్చనీయాంశంగా మారింది.