నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశం, 14లో యువత మోడీ వెంట నడిచారు: రాహుల్
న్యూఢిల్లీ: ఓ వైపు రైతులు చనిపోతుంటే ఇండియా గేట్ ముందు యోగా చేస్తుంటారని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్లీనరీలో ఆయన బీజేపీపై నిప్పులు చెరిగారు. తమిళనాడు వెళ్లి భాష నేర్చుకోమంటారని, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లి మీరు తినేది నచ్చలేదంటారని, మహిళలు దుస్తులు సరిగా వేసుకోవడం లేదంటారని మండిపడ్డారు.
బీజేపీ-ఆరెస్సెస్ కౌరవులు, బీజేపీ చీఫ్ హత్య కేసు నిందితుడు: రాహుల్ గాంధీ
తాను గుజరాత్లో గుడికి వెళ్తే రాజకీయం చేశారన్నారు. తాను గుడికి, మసీదుకు, చర్చికి, గురుద్వారకు వెళ్తానన్నారు. మన ప్రధాని లాగే నీరవ్ మోదీ పేరు ఉందన్నారు. ఓ వ్యాపారవేత్త రూ.20వేల కోట్లు మింగేశారన్నారు. ప్రధాని మోడీ సత్యాన్ని దాచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
దేశంలో మోడీ మాయ తప్ప ఏమీ కనిపించడం లేదన్నారు. స్వచ్ఛ భారత్, యోగా దివస్, సర్జికల్ స్ట్రయిక్స్ ఇవన్నీ సత్యాన్ని దాచే ఉద్దేశ్యంలో భాగమే అన్నారు. తాము (కాంగ్రెస్) దేశం కోసం ప్రాణాలిచ్చామని, తమకు ద్వేషించడం తెలియదన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో దేశాన్ని మార్చే శక్తి ఉందన్నారు. మా ఉపాధి ఎక్కడ అని యువత ప్రశ్నిస్తోందన్నారు. యువతే కాంగ్రెస్కు హస్తం అన్నారు. దేశ ప్రజలకు తమ పార్టీ న్యాయం చేస్తుందన్నారు. నిజమైన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందన్నారు. నాయకులకు, కార్యకర్తలకు దూరం దూరం తగ్గించడమే తన ఉద్దేశ్యమన్నారు.
యువతరమే ఈ దేశాన్ని మార్చగలదన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. నాలుగేళ్ల క్రితం యువత మోడీ వెంట నడిచారని, కానీ ఆయన మాత్రం లలిత్ మోడీ, నీరవ్ మోడీల వెంట నడిచారన్నారు. దేశంలో నైపుణ్యతకు కొదవలేదని, లేనిదల్లా ప్రోత్సాహమే అన్నారు. నైపుణ్యం ఉన్న వాళ్లకు బ్యాంకుల ద్వారా అప్పులు ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు.
రైతులు నేరుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చునని చెప్పారు. ప్రతి జిల్లాకు ఓ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ ఎప్పు డు కూడా దేశ అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యాన్ని మరిచిపోదన్నారు.
ఉన్నత విద్యను దేశం నలుమూలలా విస్తరిస్తామని చెప్పారు. మన దేశంలో ఐఐటీలు, ఐఐఎంలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. దేశ చరిత్రలో తొలిసారి అన్యాయం జరుగుతోందంటూ నలుగురు జడ్జిలు మీడియా ముందుకు వచ్చారని చెప్పారు. దేశంలోని వ్యవస్థలను ఆరెస్సెస్ నాశనం చేస్తోందన్నారు. వ్యవస్థలన్నీ ఆరెస్సెస్ కనుసన్నుల్లో నడవాల్సిన పరిస్థితి అన్నారు. అన్ని వ్యవస్థలను బీజేపీ భయభ్రాంతులకు గురి చేసిందన్నారు.