ప్రజాస్వామ్య దేశంలో ఫేస్బుక్ జోక్యమేంటి?: మార్క్ జుకర్బర్గ్కు కాంగ్రెస్ లేఖాస్త్రం
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఫేస్బుక్పై వాల్ స్ట్రీట్ జర్నల్లో వచ్చిన కథనం దేశ రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోపాటు పలువురు నేతలు విమర్శలు గుప్పించగా.. బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. తాజాగా, కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసి ఫేస్బుక్ అధిపతికి లేఖ రాసింది.
మార్క్ జుకర్బర్గ్కు కాంగ్రెస్ లేఖ..
భారత ప్రజాస్వామ్యంలో దేశ ఫేస్బుక్ విభాగం జోక్యం చేసుకుంటోందని, దీనిపై విచారణ జరిపించాలంటూ ఆ సోషల్ మీడియా సీఈఓ మార్క్ జుకర్బర్గ్కు కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఓ లేఖ రాశారు. భారత ఫేస్బుక్ విభాగం కార్యకలాపాలపై దర్యాప్తు జరపాలని కోరింది.
దుమారం రేపిన వాల్స్ట్రీట్ కథనం..
భారత ఫేస్బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంఖి దాస్ ఆ సంస్థ నిబంధనలకు కట్టుబడకుండా, బీజేపీకి సంబంధించి పలువురి హేట్ స్పీచ్ పోస్టులను తొలగించలేదని వాల్ స్ట్రీట్ తన కథనంలో ఆరోపించింది. ఆగస్టు 14న ఈ కథనం ప్రచురించింది. వ్యాపార అవకాశాల కోసం ఆమె నిబంధనలను అమలు చేయడం లేదని పేర్కొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటు ఫేస్బుక్, అటు బీజేపీపై ఆరోపణలు చేయడం మొదలుపెట్టాయి.
విచారణ జరపాలని డిమాండ్..
ఉద్దేశ పూర్వకంగానే కొందరు నేతల విద్వేష పూరిత ప్రసంగాలను సోషల్ మీడియా నుంచి తొలగించడం లేదని ఆరోపించారు. భారత ఫేస్బుక్ కార్యకలాపాలపై విచారణ జరిపించాలని, ఆ నివేదికను తమకు రెండు నెలలోగా అందించాలని మార్క్ జుకర్బర్గ్ బర్గ్ను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. అంతేగాక, భారత ఫేస్బుక్ విభాగానికి కొత్త టీమ్ను నియమించాలని, దీంతో విచారణ పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత రాజకీయాల్లో ఫేస్బుక్ జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు. దీనిపై పార్లమెంటరీ కమిటీ కూడా విచారణ జరుపుతుందని అన్నారు.
ఫేస్బుక్ క్లారిటీ.. అంఖి దాస్ ఫిర్యాదు
కాగా, తనను చంపుతామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని ఢిల్లీ పోలీసులకు ఫేస్బుక్ ఇండియా పాలసీ డైరెక్టర్ అంఖిదాస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆమెపైనా కేసులు నమోదు చేస్తున్నారు. ఆమెపై ఛత్తీస్గఢ్లో ఓ కేసు నమోదైంది. కాగా, ఇప్పటికే వాల్స్ట్రీట్ కథనం, తమపై వచ్చిన ఆరోపణలపై ఫేస్బుక్ స్పందించింది. తమ కంపెనీ సోషల్ మీడియా వేదికలో హేట్ స్పీచ్, హింస లాంటి అంశాలకు తావులేదని, తాము ఎలాంటి రాజకీయాలతో సంబంధాలు ఏర్పర్చుకోలేదని స్పష్టం చేసింది. భారతదేశంలో తమకు ఎంతో పెద్ద మార్కెట్ అని, అందుకే ఇక్కడ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని తెలిపింది.