లండన్ దాడి తరహాలో ఢిల్లీకి ఉగ్ర హెచ్చరిక!: ఇంటలిజెన్స్ రిపోర్ట్తో అలర్ట్..
ఇటీవలి కాలంలో ట్రక్కు దాడులు పెరిగిపోయిన నేపథ్యంలో ఢిల్లీలోను అలాంటి ఘటన జరగవచ్చునని ఇంటలిజెన్స్ వద్ద సమాచారం ఉంది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో లండన్ తరహా దాడికి ఉగ్రవాదులు స్కెచ్ వేసినట్లు ఇంటలిజెన్స్ గుర్తించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడవచ్చునని ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం అందినట్లు చెబుతున్నారు. దీంతో యోగా వేడుకలు జరుగుతున్న కనౌట్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో బారీకేడ్లను ఏర్పాటు చేసి రోడ్లకు అడ్డుగా పెట్టారు.
కేవలం పాదాచారులు నడిచేందుకు వీలుగా కొంత స్థలాన్ని విడిచిపెట్టారు. కాగా, లండన్ లోని సెవెన్ సిస్టర్ రోడ్డులో ఉన్న ఓ మసీదుకు సమీపంలో రెండు రోజుల క్రితం వ్యాన్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. మసీదు బయట ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లింలను హతమార్చడమే ధ్యేయంగా ఈ వ్యాను దాడి జరిగింది. నిందితుడు ముస్లింలను చంపడానికి వెళ్తున్నాన్నంటూ బిగ్గరగా అరిచినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు సైతం తెలిపారు.
ఇటీవలి కాలంలో ట్రక్కు దాడులు పెరిగిపోయిన నేపథ్యంలో ఢిల్లీలోను అలాంటి ఘటన జరగవచ్చునని ఇంటలిజెన్స్ వద్ద సమాచారం ఉంది. ముందస్తు చర్యల్లో భాగంగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.