ఇలా చౌక: జల రవాణ వసతులతో నదుల అనుసంధానం తేలిక
రహదారుల తరహాలో జాతీయ జల రవాణా మార్గం ద్వారా నదులను అనుసంధానించే కొత్త విధానాన్ని నేషనల్ వాటర్వేస్ సంస్థ తెరమీదికి తెచ్చింది.
న్యూఢిల్లీ: రహదారుల తరహాలో జాతీయ జల రవాణా మార్గం ద్వారా నదులను అనుసంధానించే కొత్త విధానాన్ని నేషనల్ వాటర్వేస్ సంస్థ తెరమీదికి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన నదుల అనుసంధాన నిపుణుల కమిటీలో సభ్యుడు తమిళనాడు ఇంజినీర్ ఏసీ కామరాజ్ శనివారం ఈ కొత్త విధానాన్ని బయటపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న నదుల అనుసంధాన ప్రక్రియ ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యం అని, దాని స్థానంలో జాతీయ జలరవాణా పద్ధతిలో దేశంలోని నదులను అనుసంధానించే నూతన ప్రక్రియను చేపట్టాలని కోరారు.
గతంలో వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో నదుల అనుసంధానానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశారు. తాజాగా నరేంద్రమోదీ ప్రభుత్వం కూడా నదుల అనుసంధానంపై క్రియాశీలంగానే వ్యవహరిస్తోంది. రాష్ట్రాలను కలుపుతూ పెద్ద కాలువను తవ్వి, దాంట్లోకి నదుల వరద నీటిని మళ్లించి, ఏడాది పొడవునా అది నిల్వ ఉండేలా చేయడమే కామరాజ్ ప్రతిపాదించిన పథకం సారాంశం. ఈ కొత్త విధానం ప్రకారం ఎక్కడా నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం లేదు. ముందుగా జల మార్గానికి అనువుగా కాలువలు తవ్వాలి. అందులో ఒకే స్థాయి (కాంటూర్ లెవెల్)లో నీటి మట్టాన్ని కొనసాగించాలి.
25 శాతం మళ్లిస్తే 15 వేల టీఎంసీల వినియోగం
దేశంలో 62 వేల టీఎంసీల వరద జలాలు సముద్రం పాలవుతున్నాయి. అందులో కేవలం 25శాతం నీటిని ఇందులోకి మళ్లిస్తే 15 వేల టీఎంసీలు వినియోగంలోకి వస్తుంది. దీనివల్ల 365 రోజులూ దేశవ్యాప్తంగా 15 వేల కిలోమీటర్ల పొడవున జలరవాణా అందుబాటులోకి రావడంతోపాటు, వరదనీటిని కరువుపీడిత ప్రాంతాలకు మళ్లించడానికి వీలవుతుంది. నదుల అనుసంధాన ప్రక్రియలో పైభాగం నుంచి నీరు కిందికి వస్తుంది. ఈ విధానంలో నీరు రెండు వైపులా ప్రవహిస్తుంది. నీటి మట్టాన్ని ఒకే కాంటూర్ స్థాయిలో నిర్వహించడంవల్ల ఎటు నుంచి ఎటైనా నీరు ప్రవహించడానికి మార్గం ఉంటుంది. దేశంలోని నదులను మూడు భాగాలుగా విభజించి ఈ ప్రక్రియ చేపట్టాలని ప్రతిపాదించారు. నీటి మార్గం రూపొందించడం వల్ల రూట్లో ప్రక్రుతి అందాలు వీక్షిస్తూ విహార యాత్ర చేసినట్లుగా ఉంటుంది. వస్తువుల రవాణ తేలిగ్గా సాగిపోతూ ఉంటుంది. రహదారులు, రైళ్లలో ప్రయాణం కంటే జల మార్గంలో ప్రయాణం చాలా చౌకగా, తేలిగ్గా ఉంటుంది.
జమ్ము నుంచి బ్రహ్మపుత్ర వరకు ఇలా రవాణా
ఇందులో జమ్ము నుంచి మొత్తం హిమాలయ పర్వతాల పాదాల గుండా అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్ మీదుగా బ్రహ్మపుత్ర వరకు జలరవాణా మార్గం ఏర్పాటు చేయాలి. 150 మీటర్ల, వెడల్పు, 10 మీటర్లు లోతున 4500 కిలోమీటర్ల పొడవున ఈ మార్గం తవ్వి అందులో నిరంతరం 10 మీటర్ల ఎత్తున నీరు నిల్వ ఉండేలా చూడాలి. ఈ నీటి ప్రవాహం సమానస్థాయిలో నిర్వహించడానికి అక్కడక్కడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మించాలి. వీటిని 250 మీటర్ల వెడల్పు, 30 మీటర్ల లోతుతో నిర్మిస్తే సరిపోతుంది. దీనివల్ల గంగ, బ్రహ్మపుత్ర నదుల వరదను అరికట్టవచ్చు.
మధ్యమధ్యలో బాలెన్సింగ్ రిజర్వాయర్లు కావాలి
ఉత్తరప్రదేశ్లో వింధ్య పర్వతాల వద్ద ప్రారంభమై బీహార్, పశ్చిమ బెంగాల్ మీదుగా సాగి మహారాష్ట్రను చుట్టివస్తుంది. మొత్తం పొడవు 5,750 కిలోమీటర్లు. ఇక్కడ కూడా 200 మీటర్ల వెడల్పు, 30 మీటర్ల లోతుతో అక్కడక్కడ బ్యాలెన్సింగ్ జలమార్గాలు నిర్మించాల్సి ఉంటుంది. దీనివల్ల మహానది నుంచి నర్మదకు, నర్మద నుంచి మహానది ప్రాంతానికి నీటి ప్రవాహం సాధ్యమవుతుంది. ఈ మార్గాల నుంచి సముద్రంలోకి కలిసే నీటి ద్వారా భారీమొత్తంలో విద్యుత్ కూడా ఉత్పత్తి చేయొచ్చు.
తెలంగాణ మీదుగా గోవా నుంచి మహారాష్ట్రకు..
ఇది మహారాష్ట్ర నుంచి ప్రారంభమై కన్యాకుమారి వరకు సాగుతుంది. మధ్యలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవాలను చుట్టి మళ్లీ మహారాష్ట్రకు చేరుతుంది. ఇందుకోసం 4,625 కిలోమీటర్ల పొడవునా కాలువ తవ్వాల్సి ఉంటుంది. దీని వెడల్పు 100 మీటర్లు, లోతు 10 మీటర్లు ఉంటే సరిపోతుంది. ఇక్కడకూడా జలమార్గంలో సమానస్థాయిలో నీటిమట్టాల నిర్వహణకు 200 మీటర్ల వెడల్పు, 30 మీటర్ల లోతున బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంటుంది.
ప్రయోజనాలు ఎక్కువ
కేంద్రం ప్రస్తుతం తలపెట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టుతో పోలిస్తే ఈ విధానంతో ఖర్చు తక్కువ, ప్రయోజనం ఎక్కువ కలుగుతుందని ఏసీ కామరాజ్ తెలిపారు. నదుల అనుసంధానానికి ఆరుశాతం భూ సేకరణ చేయాల్సి ఉండగా, ఈ విధానానికి రెండు శాతం సరిపోతుంది. జల రవాణా మార్గంలో 365 రోజులూ నీరు ఉండటంవల్ల 15 వేల కిలోమీటర్ల మేర అతితక్కువ ఖర్చుతో రవాణా చేసుకోవచ్చు. ఇందులో వాడుకొనే జలమంతా వరదనీరే కాబట్టి అన్ని రాష్ట్రాలకూ ప్రయోజనమే తప్ప నష్టం ఉండదు. బూట్ పద్ధతిలో దీన్ని చేపడితే కేంద్రంపై ప్రత్యేకంగా ఆర్థికభారం కూడా పడదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శికి ఈ విధానాన్ని వివరించామని, వారు సంసిద్ధత వ్యక్తం చేశారని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నదీ జలాలను క్రుష్ణా డెల్టా ప్రాంతాలకు విజయవంతంగా తరలించి చూపారు మరి.