రహదారులు: కనెక్టింగ్ రూరల్ ఇండియా..
యూపీఏ హయాంలో 73.49కి.మీకు పడిపోయిన రోడ్ల నిర్మాణాన్ని మోడీ ప్రభుత్వం 36కి.మీ పేర పెంచగలిగింది. ఈ లెక్కన ప్రతీరోజు దేశంలో 109.7కి.మీ మేర రోడ్ల నిర్మాణం నిరంతరాయంగా జరగుతూ వచ్చింది
రవాణా వ్యవస్థ అనేది ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా మూల స్తంభం లాంటిది. వస్తు ఆధారిత సేవలన్ని రవాణా కమ్యూనికేషన్ తో ముడిపడి ఉన్నవే కాబట్టి.. ఈ రంగం యొక్క ప్రభావం ఆర్థిక వ్యవస్థపై బలమైన ప్రభావం చూపగలదు. ముఖ్యంగా భారత దేశ మూలాలు గ్రామల్లో ఉన్నందునా.. పట్టణ ప్రాంతాల నుంచి వాటిని చేరుకోవడానికి సరైన కనెక్టివిటీ ఉన్నప్పుడే అసలైన అభివృద్ది సాధ్యపడుతుంది.
కేవలం అభివృద్ది రీత్యానే కాకుండా.. మెరుగైన జీవన విధానంలోను, సాంస్కృతికపరమైన మార్పుల్లోను కనెక్టివిటీ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది సాధ్యపడాలంటే అత్యుత్తమమైన రోడ్డు రవాణాను ఏర్పరుచుకోవడం అనివార్యం. ఈ నేపథ్యంలోనే గతంలో వాజ్ పేయ్ సర్కార్ హయాంలో డిసెంబర్, 2000వ సంవత్సరంలో దేశంలోని అన్ని గ్రామాలకు రవాణా వ్యవస్థ మెరుగుపడేలా గ్రామీణ్ సడక్ యోజన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. గడిచిన 17ఏళ్ల కాలంలో ఈ పథకం వల్ల లక్షలాది మంది గ్రామీణుల జీవితాన్ని ప్రభావితం చేసింది.
వాజ్పేయ్ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ హయాంలో దీనికి పునాది పడగా.. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లింది. అయితే ఆ తర్వాతి కాలంలో యూపీఏ-2 అంత ప్రభావవంతంగా దీన్ని చేపట్టలేకపోయింది. మళ్లీ మోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. యూపీఏ-2 వైఫల్యాలను చక్కదిద్దడం ప్రభుత్వానికి ఒక సవాల్ లా మారింది. రోడ్ కనెక్టివిటీ విషయంలో గత ప్రభుత్వం కన్నా తాము మెరుగ్గా పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్దిని ఒకసారి పరిశీలిద్దాం.
గ్రామీణ రోడ్లకు అంత ప్రాధాన్యత ఎందుకు?:
ఇప్పటికీ దేశంలోని 70శాతం జనాభా గ్రామాల్లోనే నివసిస్తోంది. గ్రామీణ ఆదాయాన్ని పెంచుకోవడంలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రభుత్వం.. అదే సమయంలో వారికి మెరుగైన ఆరోగ్య, విద్య సౌకర్యాలను కల్పించడంలోను సవాళ్లు ఎదుర్కొంటోంది.
ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఈ మూడు సవాళ్లు.. రోడ్ కనెక్టివిటీతో పరోక్షంగా ముడిపడి ఉన్నవే. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఒక విషయం గమనిస్తే.. పక్కా రోడ్ల ద్వారా ప్రయాణ దూరం తగ్గుతుంది. అదే సమయంలో మెరుగైన జీవన ప్రమాణాలు గ్రామీణులకు అందుతాయి. విద్య, ఉపాధి, వైద్యం కోసం వారు సకాలంలో పొరుగున ఉన్న ఊళ్లను చేరుకోగలరు.
ఈ పురోగతి ఎంతవరకు వచ్చింది?:
ఇంతకుముందే చెప్పుకున్నట్లు.. యూపీఏ-1 హయాంలో ప్రధానమంత్రి సడక్ గ్రామీణ్ యోజన కార్యక్రమం మెరుగైన ఫలితాలను సాధించింది. అదే సమయంలో వాటి నిర్మాణం కోసం భారీ స్థాయిలో ఖర్చు కూడా పెట్టారు. ఆ తర్వాతి యూపీఏ-2 హయాంలో.. తొలినాళ్లలో కాస్త మెరుగైన ఫలితాలే వచ్చినా.. ఆపై అనుకున్నంత మేర ఈ కార్యక్రమం ముందుకెళ్లలేదు.
2008-09 నుంచి 2010-11 వరకు ప్రతీరోజు 143.96కి.మీ రోడ్ల నిర్మాణం జరిగింది. తర్వాతి కాలంలో 2011-12, మరియు 2013-14కాలంలో ఇది కేవలం 73.49కి.మీకు పడిపోయింది.
యూపీఏ కన్నా ఎన్డీయేను ముందు నిలిపిన మోడీ:
యూపీఏ హయాంలో 73.49కి.మీకు పడిపోయిన రోడ్ల నిర్మాణాన్ని మోడీ ప్రభుత్వం 36కి.మీ పేర పెంచగలిగింది. ఈ లెక్కన ప్రతీరోజు దేశంలో 109.7కి.మీ మేర రోడ్ల నిర్మాణం నిరంతరాయంగా జరగుతూ వచ్చింది. 2016-17సంవత్సర కాలంలో ఇది మరింత పెరిగి ప్రస్తుతం ప్రతీరోజు 129.7కి.మీ మేర నిర్మాణం జరుగుతోంది.
చివరగా చెప్పొచ్చేదేంటంటే!
ఎన్డీయే ప్రభుత్వం క్రమానుగుణంగా రోడ్ల నిర్మాణ పరిధిని పెంచుకుంటూ వెళ్లాల్సిన అవసరముంది. ఇది సాధ్యపడాలంటే కొత్త రోడ్ల నిర్మాణంలో ఎక్కడా జాప్యం తలెత్తకుండా చూడాల్సిన అవసరముంది. ఇనామ్ ప్రో లాంటి ఒక వినూత్న ఆలోచన కేవలం పారదర్శకంగా వ్యవహరించడానికి మాత్రమే గాక త్వరితగతిన పనులు పూర్తవడానికి ఉపయోగపడుతుంది.
(నితిన్ మెహతా, మేనేజింగ్ భాగస్వామి, రన్నితి కన్సల్టింగ్ అండ్ రీసెర్చ్. ప్రణవ్ గుప్తా-ఇండిపెండెంట్ రీసెర్చర్)