సహజీవనం ఇష్టపూర్వక శృంగారం, పెళ్లి చేసుకోకుంటే రేప్ కాదు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: సహజీవనం చేసి పెళ్లాడకపోతే అది అత్యాచారం కాదని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం స్పష్టం చేసింది. సహజీవనం అత్యాచారం ఎలా అవుతుందని అబిప్రాయపడింది. సహజీవనం చేస్తున్న మహిళ ఇష్టపూర్వకంగానే ఓ పురుషుడితో శృంగారంలో పాల్గొంటే దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని తేల్చి చెప్పింది.
ఇలాంటి సందర్భాల్లో బాధితురాలు ఫిర్యాదు చేస్తే న్యాయస్థానం చాలా జాగ్రత్తగా ఆచితూచి కేసును పరిశీలించాలని పేర్కొంది. ఇద్దరు ఇష్టపూర్వకంగా సహజీవనం చేసి, ఇష్టపూర్వకంగా శారీరకంగా కలుస్తున్నారని చెప్పారు.
భాగస్వామిని పెళ్లి చేసుకోకుంటే అత్యాచారంగా పరిగణించలేం
మహారాష్ట్రకు చెందిన ఓ నర్సు వైద్యుడి పైన వేసిన కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ మేరకు స్పష్టతనిచ్చింది. సహజీవనం చేస్తున్న పురుషుడు తప్పనిసరి పరిస్థితుల్లో భాగస్వామిని పెళ్లి చేసుకోకుంటే అప్పటి వరకు వారి మధ్య ఉన్న సంబంధాన్ని అత్యాచారంగా పరిగణించలేమని జస్టిస్ ఏకె సిక్రి, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్తో కూడిన ధర్మాసనం ఈ కేసును కొట్టివేసింది.
పరస్పర అంగీకార శృంగారం
అత్యాచారానికి, పరస్పర అంగీకార శృంగారానికి చాలా తేడా ఉందని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త చనిపోయిన అనంతరం సదరు నర్సు కొన్నాళ్లుగా వైద్యుడితో ప్రేమలోపడి అతనితో సహజీవనం చేస్తోందని, వారిమధ్య ఇష్టపూర్వక శృంగారం కొనసాగుతోందని పేర్కొంది.
ఆ తర్వాతే నిర్ణయం
ఇటువంటి కేసుల్లో బాధితురాలు ఫిర్యాదు చేసిన వెంటనే నిందితుని మాయలో ఆమె పడిపోయిందని కాకుండా, ఆ వ్యక్తి నిజంగా ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడా లేక కోరిక తీర్చుకునేందుకు తప్పుడు మార్గం ఎన్నుకున్నాడా? అతని తీరులో దురుద్దేశం ఏదైనా ఉందా? అన్న అంశాలను కూలంకుషంగా పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.