మీలో ఒకడిగా చెప్తున్నా, రాజ్యాంగం మూలాల్లోకి వెళ్లాలి: అదరగొట్టిన మోడీ
న్యూఢిల్లీ: రాజ్యాంగం పైన చర్చకు అందరూ ఆసక్తి చూపించారని, నేను చర్చకు సమాధానం చెప్పడం లేదని, మీలో ఒకడిగా చెబుతున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఆయన లోకసభలో ప్రసంగించారు. రాజ్యాంగం మూలాల్లోకి వెళ్లాలని అందరికీ హితవు పలికారు.
రాజ్యాంగం పైన చర్చకు అందరూ ఆసక్తి కనబర్చారన్నారు. నేను ఈ సభలో ఓ సభ్యుడినని, ఈ అంశంపై తన ఆలోచనలను సభలో ప్రస్తావిస్తానని చెప్పారు. రాజ్యాంగంపై చర్చకు కృషి చేసిన సభాపతికి కృతజ్ఞతలు అన్నారు. రాజ్యాంగంపై అభిప్రాయం తెలిపిన సభ్యులకు ధన్యవాదాలు అన్నారు.
మీలో ఒకడిగా నేను ఈ చర్చపై స్పందిస్తున్నానని చెప్పారు. నవంబర్ 26 చారిత్రక దినం అన్నారు. అన్ని వర్గాలు రాజ్యాంగాన్ని అర్థం చేసుకునేలా చూడాలన్నారు. రాజ్యాంగం నిర్మాణం వెనుక మహనీయుల కృషి ఉందన్నారు. రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు తెలియజేయడమే ఈ చర్చ ఉద్దేశ్యమన్నారు.
భిన్నత్వం కలిగిన భారత్ను కలిపి ఉంచే శక్తి రాజ్యాంగానికి ఉందని చెప్పారు. రాజ్యాంగం స్ఫూర్తి అంటే నేను, మీరు అనేది కాదని.. 'మనం' అన్నారు. అన్ని ప్రభుత్వాలు దేశ అభివృద్ధికి కృషి చేశాయని చెప్పారు. జాతి మొత్తాన్ని ఏకతాటిపై నిలిపే శక్తి రాజ్యాంగానికి ఉందన్నారు.
దేశ అభివృద్ధిలో ప్రతి ప్రధాని పాత్ర ఉందని నేను ఎర్రకోట పైననే చెప్పానని గుర్తు చేశారు. రాజ్యాంగం కోసం కృషి చేసిన అంబేడ్కర్ను మనం మరువలేమని చెప్పారు. భారత్ లాంటి రాజ్యాంగం రూపొందించడం అంత సులువు కాదన్నారు. ప్రపంచంలోని అన్ని మతాలను భారత్లో అనుసరిస్తారన్నారు.
రాజ్యాంగం రూపకల్పన చేసిన అందరికీ కృతజ్ఞతలు అన్నారు. రాజ్యాంగాన్ని ఓ దస్త్రంగా చూస్తే ప్రజాస్వామ్యానికి ఇబ్బంది అన్నారు. రాజ్యాంగం మూలాల్లోకి వెళ్లి అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. తాను చర్చకు జవాబివ్వడం లేదని, మీలోని ఓ సభ్యుడిగా మాట్లాడుతున్నానని చెప్పారు.
రాజ్యాంగం భారతీయుల గౌరవానికి ప్రతీక, ఐక్యతకు నిదర్శనం అన్నారు. రాజ్యాంగం అనేది ఒక సాధారణ పదం కాదన్నారు. అంబేడ్కర్ బోధనలు, ఆలోచనలు తరతరాలకు అనుసరణీయమన్నారు. రాజ్యాంగంలోని ప్రతిపుటలో అంబేడ్కర్ గొప్పతనం కనిపిస్తుందన్నారు.
అంబేడ్కర్ ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. కానీ రాజ్యాంగంలో ఎక్కడా వాటిని ప్రతిబింభించలేదన్నారు. సంఖ్యాబలం పాలన కన్నా ఏకాభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజల్లో రాజకీయ నేతల పట్ల విశ్వాసం తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవాళ మనముందున్న సవాల్ విశ్వసనీయతను సంపాదించుకోవడమేనని చెప్పారు. రాజ్యాంగం పైన ఆసక్తి పెంపొందించేందుకు ఆన్లైన్ పోటీలు నిర్వహించాలన్నారు. మన బాధ్యత తెలుసుకున్నప్పుడే న్యాయమైన పాలన సాధ్యమన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత మనపైన ఉందన్నారు. జనసేనే ప్రజల సేవ అన్నారు.
ఐడియా ఆఫ్ ఇండియా అంటూ అదరగొట్టారు
ప్రసంగం చివరలో ఐడియా ఆఫ్ ఇండియా అంటూ ప్రధాని మోడీ అదరగొట్టారు.ఐడియా ఆఫ్ ఇండియా అంటూ..భారత్లో అనాదిగా ఉన్న సర్వధర్మ సమభావనను చాటి చెప్పారు. సత్యమేవ జయతే నుంచి ప్రారంభించి జననీ జన్మభూమిశ్చ దాకా అన్ని నినాదాలను చదివారు. అహింస భారత్ విధానమన్నారు. నారీ తూ నారాయణీ అంటూ మహిళ దేవతతో సమానమని చెప్పారు. జనసేవే దైవసేవ అన్నారు.