నేతాజీకి భారతరత్నపై పరిశీలించండి: మద్రాస్ హైకోర్టు
చెన్నై: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్కు భారతరత్న, ఆయన జయంతి రోజున సెలవు ప్రకటించడంపై పరిశీలించాలని కేంద్ర హోంశాఖను మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్కు భారతరత్న ప్రదానం చేయడంతోపాటు ఆయన జయంతి రోజు జనవరి 23న సెలవు ప్రకటించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల కేంద్రం నిర్వాహకుడు కేకే రమేశ్ న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలుచేశారు.
హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్ఎమ్ సుదర్శన్, జస్టిస్ ఎస్ విమలతో కూడిన ధర్మాసనం బుధవారం వ్యాజ్యాన్ని విచారించింది. ‘ప్రతి భారతీయుడు నేతాజీకి భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ మహనీయుడి త్యాగాన్ని ఎవరు మరిచిపోలేరు' అని విచారణ సందర్భంగా రమేశ్ తెలిపారు.
అంతేగాక, జనవరి 27న ఈ విషయాలను తెలుపుతూ హోంశాఖ కార్యదర్శికి నివేదించానని కూడా వివరించారు. ‘ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ కార్యదర్శి పరిశీలించాలి. అయితే మేం ఈ కేసులో మంచి చెడ్డలపై పరిశీలన చేయదల్చుకోలేదు' అని ధర్మాసనం తెలిపింది.