హత్రాస్ ఘటనలో కుట్ర కోణం: 19 మందిపై కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు
న్యూఢిల్లీ: హత్రాస్ హత్యాచార ఘటనకు సంబంధించి 19 మంది గుర్తుతెలియని వ్యక్తులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసులు నమోదు చేవారు. ఈ ఘటనను తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఈ కేసులు నమోదు చేశారు.
దేశ ద్రోహం, కుట్ర కోణం, మతపరమైన విద్వేషాలు రెచ్చగట్టేలా వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. స్థానిక చందా పోలీస్ స్టేషన్లో ఈ కేసులు నమోదు చేశారు. హత్రాస్ కేసు విషయంలో యూపీ ప్రభుత్వ ప్రకటనలను మార్చి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నట్లు వారిపై ఈ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తమ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాల్చేయడం, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఈ కేసులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, హత్రాస్ ఘటనలో దాడికి గురై కొన్ని రోజుల తర్వాత మృతి చెందిన యువతిపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడించిన విషయం తెలిసిందే. బాధితురాలి నుంచి సేకరించిన నమూనాల్లో వీర్యం ఆనవాళ్లేవి లేవని ఆగ్రాలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వెలువరించిన నివేదిక స్పష్టం చేసింది. సెప్లెంబర్ 14న ఈ దారుణం జరిగింది. తీవ్రగాయాలతో ఉన్న 19ఏళ్ల బాధితురాలిని అలీగఢ్లోని జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందించారు.
ఆ తర్వాత ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. హత్రాస్ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. యూపీ సర్కారుపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.