ఉగ్రఘాతుకం: కానిస్టేబుల్, బీజేపీ కార్యకర్తను కాల్చి చంపేశారు, పాక్, ఐఎస్ జెండాలతో దాడులు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులతో తెగబడ్డారు. ఓ పోలీసుతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. బుధవారం తెల్లవారుజామున షబీర్ అహ్మద్ భట్ అనే బీజేపీ కార్యకర్తను ఉగ్రవాదులు తుపాకులతో కాల్చి చంపేశారు.
షబీర్ను మంగళవారం సాయంత్రం ఉగ్రవాదులు అపహరించారు. కాగా, బుల్లెట్ గాయాలతో పడివున్న అతడి మృతదేహాన్ని బుధవారం ఉదయం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గతవారం జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ప్రకటన జారీ చేసిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి రాజకీయ కార్యకర్త హత్య ఇదే కావడం గమనార్హం.
యువతను ఆపలేరు
షబీర్ భట్ హత్యపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. కార్యకర్త మృతిపై ఆయన సంతాపం తెలిపారు. ఉగ్రవాదులు ఇలాంటి పనులతో యువతను మంచి భవిష్యత్తును ఎంపిక చేసుకోకుండా ఆపలేరని వ్యాఖ్యానించారు. హింస ఎక్కువ కాలం నిలబడదని అన్నారు. కాగా, గత సంవత్సరం షోపియాన్ జిల్లాలో బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగా పనిచేస్తున్న గోవర్ అహ్మద్ భట్(30)ని ఉగ్రవాదులు గొంతుకోసి దారుణంగా హత్య చేశారు.
పోలీసును కాల్చి చంపిన ఉగ్రాదులు
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తతోపాటు 34ఏళ్ల పోలీసు అధికారిని కూడా ఉగ్రవాదులు బలితీసుకున్నారు. ఈద్ సందర్భంగా ప్రార్థనలు ముగించుకుని వస్తున్న పోలీసు కానిస్టేబుల్ ఫయాజ్ అహ్మద్ షాను ఉగ్రవాదులు తుపాకీతో కాల్చి చంపారు. అవగామ్ గ్రామంలోని ఈద్గా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
ఐఎస్, పాక్ జెండాలతో రెచ్చినపోయిన అల్లరిమూకలు
ఇది ఇలా ఉండగా, జమ్మూకాశ్మీర్లో ఆందోళనకారులు, అల్లరిమూకలు మరోసారి పాకిస్థాన్, ఐఎస్ఐఎస్ జెండాలు పట్టుకుని రెచ్చిపోయారు. ఈద్-ఉల్-జుహ (బక్రీద్) పర్వదినాన శ్రీనగర్లో రోడ్లపైకి వచ్చి పెద్దఎత్తున నినాదాలు చేస్తూ అలజడి రేపారు. ఈద్ ప్రార్థనల తరువాత శాంతికి భంగం కలిగించేలా భద్రతా బలగాలపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించాయి.
పాఠశాల బస్సుపైనా దాడులు
ఇదే సమయంలో షోపియాన్లోని జవూరా గ్రామంలో ఓ పాఠశాల బస్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వి భయానక వాతావరణం సృష్టించారు. పోలీసు వాహనాలపైనా రాళ్లు రువ్వుతూ బీభత్సం సృష్టించారు. తరుచూ రాళ్లు రువ్వుతూ, ఐఎస్ఐఎస్ జెండాలు ప్రదర్శిస్తూ ఆందోళనకారులు నిరసనలు తెలుపుతుండడం.. భద్రతా బలగాలకు తలనొప్పిగా మారుతోంది.