గాయపడ్డ వ్యక్తిని భుజంపై వేసుకుని, కిలోమీటర్ పరుగెత్తిః అంబులెన్స్ సకాలంలో రాక
హోషంగాబాద్ః కదులుతున్న రైలు నుంచి కింద పడ్డాడో వ్యక్తి. తీవ్రంగా గాయపడ్డాడు. రైలు పట్టాల పక్కన రక్తమోడుతూ, చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ స్థానికులకు కనిపించాడు. అతణ్ని చూసిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్కు కూడా ఫోన్ చేశారు. అంబులెన్స్ సకాలంలో రాలేదు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్ వచ్చే లోపే వారు పట్టాల వద్దకు చేరుకున్నారు. అంబులెన్స్ వస్తుందో? రాదో తెలియని స్థితి.
దీనితో పూనమ్ బిల్లోర్ అనే కానిస్టేబుల్ సాహసం చేశారు. అంబులెన్స్ కోసం ఎదురు చూస్తూ కాలక్షేపం చేయలేదు. గాయపడ్డ వ్యక్తిని భుజంపై వేసుకుని, పట్టాల వెంట పరుగెత్తారు. సుమారు ఒకటిన్నర కిలోమీటర్ దూరం ఆయన పట్టాలపైనే పరుగులు తీశారు. క్షతగాత్రుడిని సకాలంలో ఆసుపత్రిలో చేర్చారు. ఇంత జరిగినా, అంబులెన్స్ చివరి వరకూ అందుబాటులో రాకపోవడం కొసమెరుపు.
#WATCH: Police constable Poonam Billore ran for more than a kilometer along the railway tracks with an injured man on his shoulders in Hoshangabad today, after the ambulance couldn't reach the spot to rescue the man who had fell down from a train. #MadhyaPradesh pic.twitter.com/SqpdjgBZnd
— ANI (@ANI) February 23, 2019
మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్లోని బదోహికి చెందిన అజిత్ అనే వ్యక్తి ముంబై నుంచి కాన్పూర్కు రైలులో బయలుదేరాడు. మార్గమధ్యలో రైలు మధ్యప్రదేశ్ హోషంగాబాద్ జిల్లాలోని పగ్ధల్ రైల్వేస్టేషన్ దాటిన తరువాత అజిత్ పొరపాటున జారిపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డాడు. పట్టాల సమీపంలో నుంచి మూలుగులు వినిపిస్తుండటాన్ని రావణ్ పీపల్ గ్రామానికి చెందిన సుభాష్ సింగ్ అనే వ్యక్తి గమనించాడు. వెళ్లిచూడగా, తీవ్ర గాయాలతో పడి ఉన్న అజిత్ కనిపించాడు. వెంటనే సుభాష్ సింగ్ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే పూనమ్ బిల్లోర్ అనే కానిస్టేబుల్ పోలీసు జీపులో సంఘటనాస్థలానికి చేరుకున్నాడు. జీపు వెళ్లే దారి లేకపోవడంతో ఆయన జీపును కిలోమీటర్ దూరంలో ఆపారు. డ్రైవర్ తో కలిసి సంఘటనాస్థలానికి వెళ్లాడు. అజిత్ను భుజాన వేసుకుని, పట్టాల మీదే కిలోమీటర్ దూరం పాటు పరుగెత్తారు. మరో ట్రాక్పై రైలు వెళ్తున్నప్పటికీ.. ఆయన తన పరుగును ఆపలేదు. జీపు వద్దకు పరుగెత్తాడు. అనంతరం అజిత్ను జీపులో తీసుకెళ్లి, ఆసుపత్రిలో చేర్చాడు. దీన్నంతటినీ సుభాష్ సింగ్ తన మొబైల్ లో చిత్రీకరించారు. ఈ వీడియో నెట్లో వైరల్గా మారింది. పూనమ్ బిల్లోర్ సాహసం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. రియల్ హీరోగా అభివర్ణిస్తున్నారు.