క్రిమినల్ అనుకుని కాల్చాడు...తీరా కారు డోర్ తెరిచి చూడగా...
లక్నో: కారు నడుపుకుంటూ వెళుతున్న ఓ టెక్కీని కానిస్టేబుల్ కాల్చి చంపిన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని లక్నోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... లక్నోకు చెందిన వివేక్ తివారీ అనే వ్యక్తి ఓ టెక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున తన మాజీ సహచరి ఉద్యోగిని సనాఖాన్తో కలిసి కారులో వేగంగా వెళుతున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న పోలీస్ పాట్రోలింగ్ బైకును వివేక్ తివారీ ఢీకొట్టాడు. అయితే ఆగకుండా రెట్టించిన వేగంతో ముందుకు వెళ్లాడు.
కారు బైకును ఢీకొట్టడాన్ని గమనించిన పోలీస్ కానిస్టేబుల్ ప్రశాంత్ కుమార్...వెంటనే కారు కిటికీపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ కారు నడుపుతున్న తివారీకి తగిలింది. దీంతో వాహనం అదుపు తప్పి ఓ బ్రిడ్జి పిల్లర్ను ఢీకొంది. దీంతో తివారీ మృతి చెందాడు. తివారీ పక్కనే కూర్చొని ఉన్న సనాఖాన్ స్పృహ కోల్పోయింది. స్పృహ వచ్చాకా పోలీసులకు కానిస్టేబుల్ ప్రశాంత్ పై ఫిర్యాదు చేసింది.
సనాఖాన్ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కానిస్టేబుల్ ప్రశాంత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే కారు పోలీస్ పాట్రోలింగ్ మోటార్ సైకిలును ఢీకొట్టి ఆపకుండా వెళ్లే సరికి అందులో క్రిమినల్స్ ఉన్నారని కానిస్టేబుల్ ప్రశాంత్ భావించినట్లు సీనియర్ ఎస్పీ కళానిధి నెథానీ తెలిపారు. ప్రాణరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు ఆయన చెప్పారు. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున 1:30 గంటల ప్రాంతంలో గోమతినగర్ ఎక్స్టెన్షన్ ఏరియాలో జరిగింది. మృతి చెందిన తివారికి భార్య ఇద్దరు ఆడపిల్లలున్నారు.